-రోడ్డు భద్రతపై అవగాహనతో వాహనాలు నడపాలి
-డ్రైవింగ్ పట్ల నైపుణ్యత కలిగి ఉండాలి
-రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు
కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
డ్రైవింగ్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు డ్రైవింగ్ పట్ల పూర్తి అవగాహనను కలిగి ఉండాలని అప్పుడే సమర్ధవంతమైన డ్రైవింగ్ చెయ్యగలరని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు అన్నారు.
కంచికచర్ల హైవే రోడ్డులో గల శ్రీ అన్నపూర్ణ హెవీ మోటర్ డ్రైవింగ్ స్కూల్ నందు సోమవారంనాడు హెవీ వాహనాలపై శిక్షణలు పొందుతున్న విద్యార్థులతో రోడ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు హాజరయ్యారు. రాజుబాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని, అయినప్పటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించలేకపోతున్నామని ఆయన అన్నారు. వాహనాల డ్రైవింగ్ పట్ల పూర్తి అవగాహన లేకపోవడం నిర్లక్ష్యం వహించడం వంటివి ప్రమాదాలకు కారణాలని ఆయన అన్నారు. డ్రైవింగ్ పట్ల నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంపొందించే విధంగా డ్రైవింగ్ స్కూల్ లలో శిక్షణలు ఇవ్వడం డ్రైవర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రోడ్డు భద్రతపై తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన వివరించారు.
శ్రీ అన్నపూర్ణ హెవీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ వ్యవస్థాపకులు బి. నారాయణరావు మాట్లాడుతూ 2020లో హెవీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ ను ప్రారంభించడం జరిగిందని 50 జట్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. సుమారు 800 మందికిపైగా హైవీ డ్రైవర్లగా శిక్షణను పొందారని, లైట్ మోటర్ వాహనాలకు సంబంధించి 1300 మంది పైగా శిక్షణ పొందారని ఆయన అన్నారు. శిక్షణ పొందినటువంటి డ్రైవర్లు ప్రభుత్వ సంస్థలలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారని ఆయన వివరించారు. డ్రైవింగ్ పట్ల పూర్తి అవగాహన కల్పించడమే ధ్యేయంగా ఈ డ్రైవింగ్ స్కూల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ సిహెచ్ రామారావు, డ్రైవింగ్ శిక్షకుడు ఎ ప్రేమ్ చంద్, శిక్షణ పొందుతున్న డ్రైవర్లు, డ్రైవింగ్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.