-కడియం, రాజమండ్రి రూరల్ ఎంపిడివో, మేజర్ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం
-కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ లు ఆదాయ వనరులను పెంపొందించే దిశలో మరింత గా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా , డివిజనల్ గ్రామ పంచాయతీ అధికారి, ప్రత్యేక అధికారులు , ఎంపిడివో లు, మేజర్ పంచాయతీ సిబ్బంది తో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, స్ధానిక సంస్థల ఆదాయ వనరులు పెంచడం లో ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ధవళేశ్వరం, హుకుంపేట, నామవరం, బొమ్మూరు, వెలుగుబంద, పాలచెర్ల, పిడింగొయ్యి తదితర మేజర్ పంచాయతీల పన్నుల వసూళ్ళు, తదితర అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలోని పంచాయతీల పరిథిలో ఆడిట్ అభ్యంతరాలు , కోర్ట్ కేసుల విషయములో నివేదిక, ప్రగతీ నివేదిక అందచేయా లన్నారు. అధిక వర్షాలు, సీజనల్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. అందుకు ఆ అనుగుణంగా అందుబాటులో ఉన్న సిబ్బంది విస్తరణ ప్రణాళిక రూపొందించుకుని, డివిజనల్ పంచాయతీ అధికారులు పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ముఖ్యంగా ప్రజలకి అందించే ప్రాథమిక సేవలు విషయములో వ్యక్తిగత పరిశీలన చేపట్టాల్సి ఉందన్నారు. ఎంపిడివో లు ఎప్పటికప్పుడు పంచాయతీ కార్యదర్శులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పర్యవేక్షణ చేపట్టల్సి ఉందన్నారు.
ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్..కృష్ణ నాయక్, డివిజనల్ పంచాయతీ అధికారి అమ్మాజి, ఎంపిడివో లు డి. శ్రీనివాస్, జి. రాజ్ మనోజ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.