-ప్రజలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు చట్టాన్ని ఉల్లంఘించ కుండా సంయమనం పాటించాలి
-హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడి
అమరావతి, జూలై 18:
రాష్ట్రంలో శాంతి భద్రతలకు (లా అండ్ ఆర్డర్) ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని, అలాంటి వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి అన్నారని మంత్రి అనిత తెలిపారు. క్రిమినల్స్ ను దండించే విషయంలో పార్టీలు, కులాలను పరిగణన లోకి తీసుకునే ప్రసక్తే లేదని, శాంతి భద్రతల (లా అండ్ ఆర్డర్) పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సామాన్య ప్రజల జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని, ఎక్కువగా దగ్గరి బంధువుల ద్వారానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ, విద్యా, పోలీసు శాఖల సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ కు కమిటీని నియమించి, విద్యార్థినులతో పాటు తల్లిదండ్రులకు కూడా అత్యాచారాలకు ఆస్కారం ఉన్న కారణాలపై అవగాహన సదస్సులు నిర్వహించ నున్నట్లు మంత్రి అనిత తెలిపారు.