ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆషాడ మాసం సందర్బంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ భ్రమరాంభికా మల్లిఖార్జున స్వామి వారి దేవస్థానం, శ్రీశైలం నుండి ఆలయ కార్యనిర్వాహణాధికారి డి. పెద్దిరాజు దంపతులు మరియు ఆలయ అధికారులు కనకదుర్గ అమ్మవారికి ఆషాడ సారె సమర్పించుటకు విచ్చేయగా వీరికి దుర్గ గుడి ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యముల నడుమ స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేసినారు. అనంతరం శ్రీశైలం దేవస్థానం వారు శ్రీ దుర్గ గుడి కార్యనిర్వాహనాధికారి కి మరియు సిబ్బందికి శ్రీశైలం దేవస్థానం శేషవస్త్రం, ప్రసాదములు మరియు చిత్రపటము అందజేశారు.
అనంతరం మహామండపం 6వ అంతస్తు నందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి, అందరికీ ఆశీర్వాదం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ వైదిక సిబ్బంది, సహాయ కార్యనిర్వాహనాధికారి, శ్రీశైలం దేవస్థానం అర్చకులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.