-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విపరీతమైన వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముందస్తు ప్రణాళికలతో అధికారులు సన్నద్ధంగా ఉండాలని, ఎలాంటి మానవ, పశు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు అధికారులతో సమావేశం నిర్వహించి భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ముందస్తుగా ప్రణాళికలతో అధికారులు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. నీటి పారుదల శాఖ వారు కరకట్టలు బలహీనంగా ఉంటే ముందుగానే గుర్తించి వాటిని పటిష్ట పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆర్ అండ్ బి అధికారులు బలహీనమైన కల్వర్ట్లు గుర్తించి అవి తెగిపోతే ప్రత్యామ్నాయ మార్గాల ప్రణాళిక ఉండాలని సూచించారు. నవంబర్, డిసెంబర్ నెలలలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంటాయని, ముందస్తు సన్నద్ధత ఉండేలా అన్ని సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెట్లు పడిపోతే వాటిని కత్తిరించి రోడ్ క్లియర్ చేసే విధంగా కట్టర్ లు అందుబాటులో ఉండేలా ఆర్ అండ్ బి అధికారులు, పునరావాస కేంద్రాల గుర్తింపు రెవెన్యూ అధికారులు చేయాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ పవర్ సప్లై, జనరేటర్ వంటివి అందుబాటులో ఉండేలా ప్రణాళికలతో చర్యలు తీసుకోవాలని, పౌర సరఫరాల శాఖ వారు స్టాక్ సన్నద్ధత ప్లానింగ్, ఆర్డబ్ల్యుఎస్ టాంక్ ల ద్వారా నీటి సరఫరాకు, శానిటేషన్ డిపిఓ, డిస్ట్రిక్ట్ ఫైర్ అధికారులు రోప్, లైఫ్ జాకెట్లు, రెస్క్యూ టీమ్స్, మత్స్య శాఖ పడవలు, గజ ఈతగాళ్ళు అందుబాటుకు ప్రణాళికతో సన్నద్ధంగా ఉండాలని అన్నారు. డిఎంహెచ్ఓ అవసరం మేరకు మెడికల్ క్యాంపులు, 108 ఏర్పాటు, డాక్టర్లు వంటి వాటి సంబంధిత అంశాలపై సన్నద్ధత ఉండాలని సూచించారు. ఇలా పలు శాఖలు వారి ముందస్తు ప్రణాళికలతో వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, డిపిఓ సుశీల దేవి, జిల్లా ఆర్ అండ్ బి, ఆర్ డబ్లూ ఎస్, పంచాయితీ రాజ్ అధికారులు మధుసూధన్ రావు, విజయ కుమార్, శంకర్ నారాయణ,డిఫ్ఓ రమణయ్య, డిఎంహెచ్ఓ డా. శ్రీహరి, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.