మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, పోర్టు కనెక్టివిటీ రైలు రోడ్డు మార్గాల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పోర్టు, మేరీ టైం బోర్డు, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు అభివృద్ధి పనుల్లో భాగంగా పోర్టు కనెక్టివిటీ రైల్ రోడ్డు మార్గాల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ సమస్యలపై సమీక్షించారు.
ఈ సమావేశంలో కలెక్టర్ బందరు పోర్టు నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులు వేగవంతం గావించాలన్నారు. ముఖ్యంగా బందరు పోర్టు కనెక్టివిటీ రైలు రోడ్డు మార్గాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో సమస్యలు పరిష్కరించేందుకు తీసుకోవలసిన చర్యలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. తదుపరి ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయాలని, అనంతరం డ్రాఫ్ట్ డిక్లరేషన్ (డి డి) జారీ చేయాలని రెవిన్యూ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఏవైనా కోర్టు కేసులు పెడితే అడ్మిషన్ టైం లోనే నిబంధనలు సంపూర్ణంగా కోర్టుకు సమర్పించి త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. తొలుత గత సమావేశపు మినిట్స్ అంశాల వారిగా తీసుకున్న చర్య నివేదికలపై సమగ్రంగా సమీక్షించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డి ఆర్ ఓ కె చంద్రశేఖర రావు, పోర్టు ఎండి ప్రతాపరెడ్డి, మ్యారీ టైం బోర్డు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్రావు, మెరైన్ డివిజన్ డిఈఈ ఎం. శివయ్య, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సూపర్నెంట్ తేజేశ్వరరావు, తాసిల్దారు వెంకటేశ్వరరావు, పోర్టు డిపిఆర్ కు సంబంధించి రైట్స్ ప్రతినిధులు విశ్వనాథన్, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.