Breaking News

బాధితులకు బాసటగా…

-సమస్యలతో వచ్చిన వారికి మంత్రి కొల్లు రవీంద్ర తక్షణ పరిష్కారం
-తప్పుడు కేసులు, సమస్యలపై అధికారులకు ఫోన్
-వెల్లువలా తరలి వచ్చిన వైసీపీ అరాచక పాలనా బాధితులు
-ప్రశ్నిస్తే కేసు అనేలా గత పాలన సాగిందన్న మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రశ్నిస్తే కేసు, ఎదురిస్తే దాడి అనేలా సాగిన జగన్ రెడ్డి అరాచకాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని గనులు, భూగర్భ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో కలిసి ప్రజాదర్బార్‌లో పాల్గొన్నారు. వందలాదిగా తరలి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వ అరాచక పాలనా బాధితులతో మాట్లాడారు. వారి నుండి వినతులు స్వీకరించారు. ఎక్కువగా భూ అక్రమాలు, గనులు మైనింగ్ దోపిడీలపైనే ఫిర్యాదులు రావడంపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తప్పులు చేసి తిరిగి కేసులు పెట్టినట్లు పలుబురు బాధితులు పేర్కొనడంతో అధికారులతో మాట్లాడారు.
భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం మత్స్యపురికి చెందిన మహిళ గల్ఫ్ దేశాల్లోని మస్కట్ ఉద్యోగం కోసం వెళ్లి గత ఏడాదిగా అక్కడే చిక్కుకుపోయింది. ఆమెను తిరిగి స్వస్థలానికి రప్పించేందుకు ఎన్ఆర్ఐ టీడీపీ నేతలతో మాట్లాడి సమస్య వివరించారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లకు చెందిన కోమరగిరి శివమ్మ రెండో కుమారుడిని ఆమె కోడలు తన ప్రియుడితో కలిసి హత్య చేయించింది. కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తుండడంతో పల్నాడు జిల్లా ఎస్పీతో మంత్రి మాట్లాడి కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు.
పాలకొండ నియోజకవర్గం పరిధిలోని భామిని మండలి బాలేరు గ్రామ పంచాయతీలో వైసీపీ నాయకులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఏపీ నుండి ఇసుక ఒడిశాకు తరలించి అమ్ముకుంటున్నారు. దాన్ని ప్రశ్నించినందుకు తెలుగుదేశం పార్టీ నాయకుడు గోవిందరావు, అతని భార్య, కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కు విషయం వివరించి అక్రమ ఇసుక తరలింపు అడ్డుకోవాలని, అక్రమ కేసుల విషయంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదే సమయంలో నామినేటెడ్ పదవుల కోసం వచ్చిన పార్టీ కార్యకర్తల నుండి వినతులు స్వీకరించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్రంలో నూతన అధ్యాయం మొదలైందన్నారు. గతంలో ప్రజల సమస్యలు పట్టించుకునే నాధుడే లేకుండా పోయారని, కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన ఎప్పుడూ ప్రజల కోసమేనని మరోసారి నిరూపించుకున్నారన్నారు. మంత్రులు ఎన్ని పనులున్నా, ఎంతటి సమస్యల్లో ఉన్నా ప్రతి రోజూ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని నిర్ణయించడం ప్రజల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శన అన్నారు. ఇక్కడకు వచ్చిన వారిలో ఎక్కువ మంది అక్రమ కేసుల బాధితులే ఉన్నారని, జగన్ రెడ్డి ఎంతగా కక్ష సాధింపులకు పాల్పడ్డారో ఇది నిదర్శనం అని వచ్చిన వారితో పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడానికే తాము ఉన్నామని, నిత్యం వారి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టితో పని చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *