-హిందీ ప్రాంతీయులకు ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ హితవు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
త్రిభాష సూత్రం ఈ దేశానికి శ్రేయస్కరమని, హిందీ ప్రాంతీయులు తప్పనిసరిగా ఏదో ఒక దక్షిణ భారతీయ భాషను నేర్చు కోవాలని అప్పుడే జాతీయ సమైక్యత సాధ్యమని పద్మభూషణ్, విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అన్నారు. ఆ విధంగా ముందడుగు పడనంత వరకు వారికి దక్షిణాది రాష్ట్రాల వారిని హిందీ నేర్చుకోమనే అర్హత ఉండదని హితవు పలికారు. అరవింద్ ఘోష్ – హిందీ అనే అంశంపై డిల్లీలోని యన్ డి యం సి కన్వెన్షన్ హాలులో నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ హిందీ సమ్మేళనంను ఆచార్య యార్లగడ్డ గురువారం ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితులలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల వారికి హిందీని తమ మీద అనవసరంగా రుద్దుతున్నారనే అనుమానాలు ఉన్నాయన్నారు. అయితే ఎవరు ఎన్ని భాషలు నేర్చుకుంటే అది వారికే లాభం తప్ప ఆ భాషకేమి ఒరగదని యార్లగడ్డ వివరించారు. కేంద్ర మింత్రి మేఘవాల్, పార్లమెంటు సభ్యులు సత్యనారాయణ్ జటియా, కె సి త్యాగి, ఆర్ కె సిన్హా అతిథులుగా హాజరయ్యారు. దేశ విదేశాల నుండి 500 మంది ప్రతినిదులు సదస్సులో పాల్గొన్నారు.