రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు రాజమహేంద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజి(ఆర్.ఐ.ఇ.టి) ఇంజనీరింగ్ కళాశాలలో “మాదక ద్రవ్యాల నిషేధం” మరియు “ఆంధ్ర ప్రదేశ్ ర్యాగింగ్ నిషేధ చట్టం, 1997” పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రకాష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. చెడు స్నేహాల వల్ల కానీ, పరిస్థితుల కారణంగా కానీ మాదక ద్రవ్యాల ఉచ్చులో పడకూడదని, తాత్కాలిక ఆనందం కోసం వీటిని సేవించడం వల్ల అనేక రుగ్మతలకు గురవుతారని వివరించారు. “ఎన్.డి.పి.ఎస్. యాక్ట్, 1985” పై అవగాహన కల్పిస్తూ మాదక ద్రవ్యాలను కలిగి ఉండడం, సేవించడం, సరఫరా చేయడం, తయారీ, క్రయ-విక్రయాలూ… అన్నీ క్రిమినల్ నేరాలుగా పరిగణించడం జరుగుతుందని పేర్కొన్నారు.
అటువంటి ఘటనకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఇటువంటి నేరాలలో పట్టుబడితే వారి భవిష్యత్తు దెబ్బతింటుందని, కాబట్టి అందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు. మాదక ద్రవ్యాల బారిన పడిన వారు స్వయంగా సహాయం కోసం ముందుకు వస్తే వారిపై ఎటువంటి నేర విచారణ ఉండదని, వారి వ్యసనముక్తి కోసం ఉచిత వైద్య సహాయం అందించబడుతుందని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ “నల్సా మాదక ద్రవ్యాల బాధితులకు న్యాయ సేవలు మరియు మాదక ద్రవ్యాల నిషేధం, 2015” పథకం ద్వారా అందిస్తున్న సేవల గురించి వివరించారు. విద్యార్థులు ర్యాగింగ్ వంటి అనైతిక చర్యలకు పాల్పడరాదని, ర్యాగింగ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే హక్కు కళాశాల యాజమాన్యానికి ఉంటుందన్నారు. అలా చర్యలు తీసుకోని పక్షంలో చట్టం పరిథిలో వారి పైన కూడా చర్యలు తీసుకుంటుందని అవగాహన కల్పించారు. ర్యాగింగ్ కేసులో నేరం రుజువు అయ్యి 6 నెలలకన్నా ఎక్కువ కాలం శిక్షపడిన వారు కళాశాల నుండి డీబార్ చెయ్యబడతారని, మరే ఇతర విద్యా సంస్థలోను అడ్మిషన్ లభించదని తెలిపారు.
ఈ సదస్సులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్.ఐ వై. దుర్గా ప్రసాద్ , కళాశాల ప్రిన్సిపల్ డా. బి. సుధీర్ , కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్) ప్రొఫెసర్ డా. ఆర్. రాంబాబు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.