-ఏనుగుల వల్ల పంటలు ధ్వంసంపై అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో చర్చించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేయడం, జనావాసాల్లోకి రావడం వల్ల ప్రజల్లో ఆందోళన కలుగుతోందని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులకులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం అటవీ శాఖ ఉన్నతాధికారులతో అరణ్యభవన్ పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏనుగుల వల్ల రైతులకు వస్తున్న సమస్యలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల నుంచి రైతులు, ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. పొలాల్లోకి, నివాస ప్రాంతాల్లోకి వచ్చే ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అటవీ శాఖ దగ్గర కుంకీ ఏనుగుల కొరత ఉందని అధికారులు తెలిపారు. కర్ణాటకలో కుంకీ ఏనుగులు ఉన్నాయన్నారు. కనీసం అయిదు ఈ తరహా ఏనుగులను కర్ణాటక నుంచి తెచ్చుకోగలిగితే సమస్యను నివారించవచ్చు అన్నారు. పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ‘స్వయంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కుంకీ ఏనుగుల గురించి చర్చిస్తాను. వారికి మన సమస్యను వివరిస్తాను. ఆ రాష్ట్రం నుంచి ఆ తరహా ఏనుగులు తీసుకు వచ్చేందుకు కృషి చేద్దాము’ అన్నారు. వన్య ప్రాణులు రాకుండా విద్యుత్ ఫెన్సింగ్ వేసుకొనే విధానాలు విడిచిపెట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అది చట్ట ప్రకారం నేరమని కూడా తెలియచేయాలన్నారు.