-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మల్లె మడుగు రిజర్వాయర్ సమీపంలో పర్యాటక అభివృద్ధి కి మెరుగైన అవకాశాలు మెండుగా ఉన్నాయని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పర్యాటక శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ మల్లె మడుగు రిజర్వాయర్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, అధికారులతో పర్యాటక అభివృద్ధికి అవకాశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సూచిస్తూ తిరుపతి జిల్లాలో తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రపంచ నలుమూలల నుండి ప్రతి రోజూ సుమారు లక్ష మంది పర్యటిస్తున్నారు అని వారు ఒకటి రెండు రోజులు బస చేసేలా మంచి పర్యాటక ప్రదేశంగా సదరు మల్లె మడుగు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే బాగా ఉంటుందని, ప్రభుత్వానికి కూడా ఆదాయం చేకూరుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సంచాలకులు టూరిజం డా.రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.