-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు భూములు, స్థలాలు, ఇళ్లు తదితర ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిబంధనల మేరకు మాత్రమే సకాలంలో నాణ్యతగా పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నందు తిరుపతి జిల్లాలోని జిల్లా రిజిస్ట్రార్ మరియు 16 మంది ఉప రిజిస్ట్రార్లతో జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు భూములు, స్థలాలు, ఇళ్ళు తదితర ఆస్తుల్ని నిబంధనల మేరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని అన్నారు. అన్ని ఉప రిజిస్ట్రార్ కార్యాలయాలలో రికార్డుల భద్రత పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఫ్రీ హోల్డ్ భూముల మొత్తం విస్తీర్ణం, డీ నోటిఫైడ్ విస్తీర్ణం మరియు రిజిస్ట్రేషన్ చేయబడిన వివరాలపై సమీక్షిస్తూ నిబంధనలు ఉల్లంఘనలు ఉండరాదని, ప్రజా సేవలు నాణ్యతగా సకాలంలో అందించాలని అన్నారు. అలాగే రీ సర్వే గ్రామాల భూముల రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ, తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ అధికారి శ్రీ రామ్ కుమార్, జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.