మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీని ఆగస్టు 1వతేదీ ఉ.6గం.లకే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఫించన్ల పంపిణీపై రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి కలెక్టరేట్ నుండి వీడియో సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు నెలకు 2,40,939 మంది లబ్ధిదారులకు రూ.102.16 కోట్లు పంపిణీ చేయవలసి ఉందన్నారు. ఇందుకోసం జిల్లాలో 25 మండలాలు, మచిలీపట్నం నగరపాలక సంస్థతో పాటు 4 మున్సిపాలిటీలు, 507 గ్రామ వార్డు సచివాలయాలు, 4331 మంది సచివాలయ ఉద్యోగులతో లబ్ధిదారుల ఇళ్ళ వద్దే పంపిణీకి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆగస్టు 1వతేదీనే 96శాతం పంపిణీ,2వ తేదీతో నూరు శాతం ఫించన్ల పంపిణీ పూర్తి చేయాలన్నారు. పింఛన్ల పంపిణీలో గత నెలలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని, పింఛన్ల పంపిణీలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర సచివాలయం నుండి సిఎస్ గారితో కలిసి విసీలో పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్
సెర్ప్ సిఇఓ జి.వీరపాండ్యన్,ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె.నివాస్ పాల్గొనగా, కలెక్టరేట్ నుండి డిపిఓ ఎస్ వి నాగేశ్వర నాయక్, జడ్పీ సీఈవో ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.