-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలసి వినతి పత్రం అందించిన సుగాలీ ప్రీతి తల్లి పార్వతి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘మా అమ్మాయి సుగాలీ ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సీబీఐ వరకూ కేసు వెళ్లలేదు’ అని సుగాలీ ప్రీతి పార్వతి కన్నీటి పర్యంతమవుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వినతి పత్రం అందించారు. మంగళవారం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ని తన కుటుంబంతో కలసి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడ బిడ్డకు జరగకుండా చూడాలని కోరారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సుగాలీ ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి పార్వతి పోరాడుతూనే ఉన్నారనీ, ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడతానని తెలిపారు.