-రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఐఏఎస్ గురువారం 30వ డివిజన్, రామకృష్ణాపురం మధ్య కట్ట నందు తానే స్వయంగా లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకొని, వారితో మాట్లాడి, ప్రతి నెల పెన్షన్ వస్తుందా లేదా? ఇంటి వద్దనే పెన్షన్ ఇస్తున్నారా లేదా? ఎంత పెన్షన్ ఇస్తున్నారు? అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించి సెక్రటరీలు పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.
తదుపరి 29వ డివిజన్ మధురానగర్ లో గల రోడ్ అండర్ బ్రిడ్జ్, బి ఆర్ టి ఎస్ రోడ్డు దగ్గర గల జిఎస్ శాస్త్రి పార్క్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చివరి దశలో ఉన్న రోడ్ అండ్ బ్రిడ్జి, సర్వీస్ రోడ్ నిర్మాణ పనులను పూర్తి చేసి త్వరలో ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బుడమేరు కాలువలోని గుర్రపు డెక్కులను తీసి కాలువను పరిశుభ్రపరచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఫుడ్ జంక్షన్ దగ్గరలో గల జిఎస్ శాస్త్రి పార్క్ ను సందర్శించిన కమిషనర్, పార్క్ లో ఆహ్లాదకరమైన వాతావరణం ఎల్లప్పుడూ ఉంచాలని, పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా ఉండాలని, పార్క్ ఆవరణలో వాకింగ్ ట్రాక్ ను అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.