-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీలను ఎ,బి,సి,డిలుగా వర్గీకరించాలన్నదే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) గతం నుండీ చెబుతోంది. సిపిఐ జాతీయ స్థాయిలో ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏకాభిప్రాయంతో ఉంది. ఇన్నేళ్ల తదుపరి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపట్ల సిపిఐ హర్షం వ్యక్తం చేస్తోంది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2004లో ఎస్సీ వర్గీకరణపై ఈవీ చిన్నయ్య జడ్జిమెంట్ను సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం పక్కనపెట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణను సమర్థించింది. ఒక కులంలో వర్గీకరణను రాజ్యాంగం అనుమతిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందంటూ తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు రిజర్వేషనుపై రాష్ట్రాలకు అధికారం కల్పించబడడాన్ని సిపిఐ స్వాగతిస్తున్నది.