-పుట్టిన బిడ్డకు వెంటనే తల్లి ముర్రు పాలు ఇవ్వటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది
-డీఎంహెచ్వో..డా. కె.వెంకటేశ్వరరావు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తల్లి, బిడ్డలు ఆరోగ్య సంరక్షణకు పుట్టిన బిడ్డకు తల్లిపాలు పాలు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.కె.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆగస్టు 1వ తేది నుంచి 8వ తేదీ వరకు జిల్లాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల నిర్వహణ కార్యక్రమాలపై శుక్రవారం స్థానిక డిఎంహెచ్వో కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, వైద్యాధికారులు వైద్య సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం తల్లి పాలు ప్రాముఖ్యత, తల్లి పాలు బిడ్డకు ఎంత అవసరమో తెలియజేసే పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఈఎంహెచ్వో డా. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలు ప్రాముఖ్యతను ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఆగస్టు1 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే తల్లిపాలు వారోత్సవాలు కార్యక్రమంలో ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఆదేశించారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లి యొక్క పసుపు రంగు లోని చిక్కటి పాలు ( ముర్రుపాలు ) బిడ్డకు అమృతం లాంటివని, తల్లి పాలు సంపూర్ణ ఆహారమని, వీటిలో బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయని, అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా వుందన్నారు. బిడ్డకు మొదటి 6 నెలలు తల్లి పాలే సంపూర్ణ ఆహారంగా ఇవ్వాలని, 6 నెలలు దాటిన తరువాత తల్లి పాలతో బాటు అనుబంధ ఆహారం అవసరమన్నారు. తల్లిపాలు వలన శిశువుకు న్యుమోనియా, అతిసార వంటి ప్రమాదకర మైన వ్యాదుల నుండి రక్షణతో పాటు పిల్లల మేదస్సు ను మెరుగుపరచడంలో సహాయ పడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగాదీనిపై గర్భిణి స్త్రీలకు, బాలింతలకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో తల్లి పాల వారోత్సవాల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు యు పి హెచ్ సి ఆవవాంబే కాలనీ, పి హెచ్ సి సమిశ్రగూడెం, కానూరు , పెరవలి ను సందర్శించి తల్లి పాల వారోత్సవాలు కార్యక్రమంలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధి కారి తో బాటు ప్రోగ్రాం అధికారులు డా. షమ్మి కుమార్, డా .హరిచంద్ర ప్రసాద్, డా.నిశాంత్, ఎంపి హెచ్ ఈఓ బాపిరాజు ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.