-ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల పై శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చెయ్యాలి
-అధికారులు సమన్వయంతో విధులను నిర్వర్తించాలి
-కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగస్టు 15వ తేదీన స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుపుకోనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత శోభాయమానంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి జిల్లా అధికారులు ఆదేశించారు.
శనివారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించిన సమీక్షా సమావేశం కలెక్టర్ నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంతి తో అదనపు ఎస్పీ ఎస్ ఆర్ రాజశేఖర్, ఇన్చార్జి జెసి, డిఆర్వో జి .నరసింహులు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఆగస్టు 15 వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయా శాఖల పరిధిలో అత్యుత్తమ సేవలందించిన వారి పేర్లనే అవార్డులకు సిఫార్సు చేయాలని సూచించారు. అవార్డుకు గౌరవం పెరిగే విధంగా ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని మాత్రమే గుర్తించి పేర్లను ఈ నెల 10వ తేదీలోగా పంపించాలన్నారు . వేడుకల్లో భాగంగా చిన్నారులు, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేలా సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టాలన్నారు. దేశభక్తి చాటేలా పాఠశాల విద్యార్ధులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఉండాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలతో కూడిన శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆయా విభాగాల పరిధిలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆగస్టు 15వ తేదీ ఉదయం 9 గంటల నుంచి జరిగే స్వాతంత్య్ర వేడుకలకు జిల్లా ప్రజలు, స్వాతంత్య్ర సమరయోధుల కుటింబీకులు, ఇతర ప్రముఖులు, ప్రతి ఒక్కరు ఆహ్వానితులేనని పేర్కొన్నారు.
స్టేజ్ అలంకరణ, సీట్ల ఏర్పాటు, సౌండ్ సిస్ట్ం, మైదానంలో అవసరమైన మేరకు మరమ్మతులు చేపట్టే విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పైలెట్ వాహనం, శకటాల ప్రదర్శనకు ఉపయోగించే వాహనాల ఫిట్ నెస్ చెక్ చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ముందుగానే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, వేడుకల రోజు అందరికీ సరిపడా తాగునీరు సమకూర్చాలని చెప్పారు. పోలీసు, ఎన్.సి.సి. విభాగాల గార్డ్ ఆఫ్ ఆనర్, పరేడ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి వేడుకులకు వచ్చే అతిథులకు, సామాన్య ప్రజలకు, విద్యార్థులకు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు సక్రమంగా ఉండేలా సంబంధిత అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం అవుతా రన్నారు. అందుకు తగిన సీటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ , ఇన్చార్జి జేసీ/ డిఆర్వో జి .నరసింహులు, కే ఆర్సిసి డిప్యూటీ కలెక్టర్, ఇన్చార్జి ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.