-ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మహిళల హక్కుల, ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి
-కార్యదర్శి కె ప్రకాష్ బాబు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోనీ గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యం, మహిళల హక్కులు, మౌలిక సదుపాయాలు కల్పించడం,అవగాహన పెంపొందించే దిశలో భాగంగా గౌరవ హై కోర్టు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆగస్ట్ 15 లోగా క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె ప్రకాష్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గౌరవ రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి వారి ఆదేశాలను అనుసరించి గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా ఉండేవారి కోసం, ప్రత్యేకంగా గిరిజన మహిళల హక్కులు కోసం, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం సంబంధించిన వాటిపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. ఆగస్టు 15 లోగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్లు, ఐ టి డి ఎ మరియు వైద్య ఆరోగ్య శాఖాధికారి తో కూడి మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సరైన రహదారి మార్గాలు లేని ఏజెన్సీ ప్రాంతాల్లో, కుగ్రామాల్లో, కొండ ప్రాంతాల్లో గిరిజన మహిళల కోసం ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. తూర్పు గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో కలెక్టర్ల , వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఉమ్మడి ప్రణాళిక రూపొందించడం జరుగుతోందని తెలిపారు. ఇందులో భాగంగా మానసిక రుగ్మతలు కలిగిన మహిళల కోసం, వితంతు మహిళల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు గౌరవ హై కోర్టు వారి ఉత్తర్వులను అనుసరించి ఆగస్ట్ 15 లోగా చేపట్టనున్నట్లు కార్యదర్శి ప్రకాష్ బాబు తెలిపారు.