-విజయవాడ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర,
-ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హర్ ఘర్ తిరంగా త్రివర్ణ శోభిత వేడుకల్లో భాగంగా బుధవారం విజయవాడలో నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. బీఆర్టీఎస్ రోడ్డులో నిర్వహించిన భారీ ర్యాలీలో వివిధ శాఖల అధికారులతో పాటు దాదాపు 450 మంది విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలు చేతబూని గుండెలనిండా దేశభక్తి భావన నింపుకొని ర్యాలీగా సాగారు. ఈ సందర్భంగా కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్లు జాతీయ పతాక విశిష్టతను వివరించారు. దేశ పౌరులుగా దేశ సమగ్రతను, జాతీయ సమైక్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. జాతీయ పతాక ఔన్నత్యాన్ని చాటిచెప్పేందుకు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మహనీయుల త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్, నార్త్ తహసీల్దార్లు సూర్యారావు, శిరీష; జెడ్సీ-2, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు తదితరులతో పాటు బిషప్ అజరయ్య బాలికల హైస్కూల్, ఏకేటీపీ మునిసిపల్ హైస్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.