Breaking News

బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో అధికారులు, వార్డెన్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంగళవారం ఆమె సమావేశమయ్యారు. హాస్టళ్లల్లో విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట ఆహారం హాస్టల్లోకి రానివ్వొద్దన్నారు. విద్యార్థులను కూడా బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. హాస్టళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సురక్షితమైన నీటినే తాగునీటిగా అందించాలన్నారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం…రుచికరమైన భోజనం, అల్పాహారం అందించాలన్నారు. పాడైపోయిన, పాచిపోయిన ఆహారాన్ని విద్యార్థులకు అందివ్వొద్దన్నారు. వార్డెన్లు రాత్రిళ్లు హాస్టళ్లలోనే బస చేయాలని మంత్రి తెలిపారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు హాస్టళ్లను సందర్శిస్తూ…కింది స్థాయి సిబ్బందిని పర్యవేక్షిస్తూ ఉండాలని మంత్రి స్పష్టంచేశారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ మల్లికార్జున, బీసీ గురుకులం కార్యదర్శి కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *