కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కొవ్వూరు నియోజక వర్గ పరిధిలోని కొవ్వూరు స్టేషన్ రోడ్ బాపూజీ నగర్ లోని మదర్ థెరిసా షెల్టర్ హోమ్ , తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలోని హోప్ ఫౌండేషన్ చిల్డ్రన్ హోమ్, తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలోని యియ అవిలా చిల్డ్రెన్ హోమ్, కొవ్వూరు మండలం అరికిరేవుల గ్రామంలోని క్రిస్టియన్ ఛారిటబుల్ సొసైటీ వసతి గృహాలను తనిఖీ చెయ్యడం జరిగిందని ఇన్చార్జి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె. నాగలక్ష్మి తెలిపారు. బుధవారం కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో పలు ప్రవేటు వసతి గృహాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కె. నాగలక్ష్మి మాట్లాడుతూ, ప్రవేటు వసతి గృహాలలో వసతులు , మౌలిక సదుపాయాలు, వసతి గృహాలలో పిల్లలు సంఖ్య, హజరు నమోదు వివరాలు పరిశీలించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వసతి గృహాల నిర్వహణా వ్యవస్థ ఉండాలనీ, పిల్లల భద్రత, పరిసరాల పరిశుభ్రత, శుద్ధమైన తాగునీరు, శానిటేషన్ నిర్వహణా చేస్తున్న తీరు, వంటలు చేసే ప్రదేశంలో జాగ్రత్తలు వంటి వాటి పై పరిశీలన చేసినట్లు తెలిపారు. వసతి గృహాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని నిర్వాహకులు కు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఐ సి డి ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.