-రూ.34.67 కోట్లతో 997 అభివృద్ధి పనులు
-301 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.24.40 కోట్లు మంజూరు
-పదకొండు సీసీ డ్రైనేజీల నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరు
-నియోజకవర్గంలో 242 పశువుల షెడ్ల నిర్మాణానికి రూ.3.63 లక్షలు రాయితీ
-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్.డీ.యే ప్రభుత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మన పంచాయతీ – మన సాధికారత గ్రామసభలు గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం తెచ్చాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన అవనిగడ్డలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అవనిగడ్డ నియోజకవర్గంలో నిర్వహించిన గ్రామసభలు ప్రతి గ్రామంలో విజయవంతం అయినట్లు తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని 91 గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ధ నిర్వహించిన ఈ గ్రామసభలు ఆయా గ్రామాల అభివృద్ధికి బాటలు వేశాయన్నారు.
విస్తృత అభివృద్ధికి ప్రజామోదం
ఈ గ్రామసభల ద్వారా అవనిగడ్డ నియోజకవర్గంలో మొత్తం రూ.34.67 కోట్లతో 997 అభివృద్ధి పనులకు ప్రజల సంపూర్ణ ఆమోదం పొందినట్లు తెలిపారు. ఈ గ్రామసభల ద్వారా అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.24.40 కోట్లతో 301 సీసీ రోడ్ల నిర్మాణం, రూ.5కోట్లతో పదకొండు సీసీ డ్రైనేజీల నిర్మాణం, రూ.35లక్షలతో ఆరు ప్రహరీల నిర్మాణ పనులను ఆమోదించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పశు పోషకులను ప్రోత్సహించేందుకు నియోజకవర్గంలో 242 కాటిల్ షెడ్స్ నిర్మాణానికి రూ.3.63 లక్షలు రాయితీగా అందించేందుకు ప్రజామోదం లభించినట్లు తెలిపారు.
వ్యవసాయానికి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత
ఈ గ్రామసభల ద్వారా ఉద్యానవన రంగాన్ని ప్రోత్సహించటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. హార్టీకల్చర్ పంటల విస్తరణ లక్ష్యంగా 111.33 ఎకరాల్లో ప్లాంటేషన్ ప్రోత్సాహం అందించేందుకు రూ.15.75 లక్షలు, 16.2కిలోమీటర్లు పొడవునా ప్రధాన రహదారులు, పంట కాలువలకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు రూ.20లక్షలు, ఇరవై ఫామ్ పాండ్స్ తవ్వకం కోసం రూ.30లక్షలు, రెండు మినీ అమృత సరోవర్ చెరువుల తవ్వకం కోసం రూ.50 లక్షలు, ఎనిమిది రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ల ఏర్పాటు కోసం రూ.10 లక్షలు, పన్నెండు చోట్ల సామాజిక ఇంకుడు గుంటల ఏర్పాటుకు రూ.12 లక్షలు, 115 ఇండివిడ్యువల్ ఇంకుడు గుంటల ఏర్పాటుకు రూ.6.90 లక్షలు, 280 ఇతర పనులకు రూ.75.60 లక్షలు కేటాయించి గ్రామసభల ద్వారా ప్రజామోదం పొందినట్లు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వివరించారు.
గ్రామీణ ప్రాంతాల సమగ్ర ప్రగతి ధ్యేయం
గ్రామ స్వరాజ్యం, గ్రామీణ ప్రాంతాల సమగ్ర ప్రగతి, భూగర్భ జలాల పరిరక్షణ, వ్యవసాయ రంగానికి ఇతోధిక ప్రోత్సాహం ప్రధాన లక్ష్యాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన అభివృద్ధి పనులు గ్రామ స్వరాజ్య సాధనకు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అన్నారు. ఆమోదం పొందిన పనుల నిర్మాణం వెంటనే ప్రారంభించి పూర్తి చేసి గ్రామాలకు మరిన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు.
ఎస్టీలకు సౌకర్యాల కల్పనకు కృషి
నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో యానాదుల నివాస ప్రాంతాల్లోని రహదారుల సమస్యలను ఇటీవల ఎస్టీ సంఘ నాయకులు తన దృష్టికి తీసుకు వచ్చారని, ఆయా సమస్యల పరిష్కారం కోసం ఉపాధి నిధులు మంజూరు చేసి గ్రామ సభల ద్వారా ప్రజామోదం పొందినట్లు తెలిపారు. అట్టడుగు వర్గాల వారు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే బుద్దప్రసాద్ తెలిపారు.