-AP నుండి పాల్గొననున్న బక్కా పరంజ్యోతి, డా జె పూర్ణచంద్రరావు తదితరులు
విజయవాడ / లక్నో, నేటి పత్రిక ప్రజావార్త :
వరుసగా ఐదోసారి బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలిగా బెహెన్జీ మాయావతి తిరిగి ఎన్నికకాబోతున్నారు. ఆగస్టు 27న లక్నోలో జరగబోయే జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో, ఈ ఎన్నికతోపాటు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల పట్ల పార్టీ రచించాల్సిన వ్యూహాలు, అవలంబించాల్సిన వైఖరి కూడా చర్చించనున్నారని, పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ డా జె పూర్ణచంద్ర రావు వివరించారు. “బహుజన్ సమాజ్ పార్టీలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జాతీయ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఇందులో జాతీయ స్థాయి నాయుకులతోపాటుగా, అన్ని రాష్ట్రాలనుండి పార్టీ ప్రధాన నాయకులు, కోఆర్డినేటర్లు, డివిజన్ ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షులు పాల్గొననున్నారు. ఏపీ నుండి పరంజ్యోతి నాయకత్వంలో నాతోపాటుగా రాష్ట్ర నేతలం పాల్గొనబోతున్నాం.”
ఈ ఎన్నికలకు ముందు 2019లో బీఎస్పీ అధినేత్రి మాయావతి జాతీయ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం ఈ నెలలోనే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగాల్సి ఉంది.
“అటు దేశవ్యాప్తంగా పుంజుకుంటున్న కులగణన డిమాండ్, ఇటు రాజకీయంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, మైనారిటీ వర్గాలకు అందాల్సిన ప్రాధాన్యత, దక్షిణాదిన పార్టీ విస్తరణ, వీటి మీద కూడా మేము చర్చించబోతున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో తన ప్రభావాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తోంది. ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిర్వహించిన మొన్నటి భారత్ బంద్కు బీఎస్పీ మద్దతు పలకడమే కాకుండా పార్టీ కార్యకర్తలు యూపీలో జిల్లా స్థాయిలో ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణపై తీర్పుతో పాటుగా, ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ మొదలగు అతిముఖ్యమైన అంశాలపై బీఎస్పీ వ్యూహం, ఆలోచనలు కూడా ఈ సమావేశంలో చర్చకు వస్తాయి.”
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి, ఇక్కడ ఏసీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సంచార జాతుల గళంగా, వారికి అండగా నిలిచే నిబద్దత, కార్యాచరణమీద కూడా మార్గదర్శకాలు రాబోతున్నాయి. త్వరలో కులగణన డిమాండ్ మీద జరగబోయే జిల్లా స్థాయి సమావేశాలపై కేలండర్, రోడ్ మ్యాప్ విడుదల చేస్తాం.”