-100 రోజులు, వార్షిక కార్యాచరణ ప్రణాళికలపై కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విస్తృత ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు, గౌరవ ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి శాఖా 100 రోజులు, వార్షిక కార్యాచరణ ప్రణాళికలను ఖరారు చేసి, లక్ష్యాలను చేరుకునేందుకు నిబద్ధతతో కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఆదేశించారు.
మంగళవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సృజన.. అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్వో వి.శ్రీనివాసరావుతో కలిసి జిల్లాస్థాయిలో శాఖల 100 రోజులు, వార్షిక కార్యాచరణ ప్రణాళికలపై సమావేశం నిర్వహించారు. ఇప్పటికే రూపొందించిన ముసాయిదా ప్రణాళికలపై శాఖల వారీగా చర్చించి.. చేర్చాల్సిన అంశాలపై మార్గనిర్దేశనం చేశారు. 100 రోజుల్లో పూర్తిచేసే అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించడంతో పాటు ఏడాదిలో చేపట్టే పనులకు సంబంధించి ప్రతిపాదనలు, లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో డాక్యుమెంట్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటే దాన్ని సాధించేందుకు అంతే కచ్చితత్వంతో కార్యాచరణ రూపకల్పనకు వీలవుతుందన్నారు. ప్రణాళికల రూపకల్పనలో బలాలు, బలహీనతలు, అవకాశాలు, ముప్పులు (స్వాట్) విశ్లేషణ కూడా ముఖ్యమన్నారు. వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ నిర్దేశించుకున్న లక్ష్యాలను ప్రణాళికాయుతంగా సాధించేందుకు కృషిచేయాలన్నారు. సమావేశంలో పౌర సరఫరాల డీఎం జి.వెంకటేశ్వర్లు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. మహేశ్వరరావు, కేఆర్ ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇ.కిరణ్మయి, డ్వామా పీడీ జె.సునీత, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి, డీఈవో యు.వి.సుబ్బారావు, డీపీవో ఎన్వీ శివ ప్రసాద్ యాదవ్ తదితర అధికారులు పాల్గొన్నారు.