-డూండీ గణేష్ సేవ సమితి 72 అడుగుల వినాయక విగ్రహం ఏర్పాటు
-72 అడుగుల మట్టి విగ్రహం నమూనా చిత్రపటం ఆవిష్కరణ
-నమూనా చిత్రపటాన్ని ఆవిష్కరించిన మంత్రి ఆనం రాం నారయణ రెడ్డి, ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వినాయక పండుగ సందర్భంగా ఖైరతాబాద్ వినాయక విగ్రహం గురించి మాట్లాడుకునే వాళ్లం…ఇప్పుడు ఎపిలో అమరావతి రాజధాని ప్రాంతంలో డూండీ గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల మట్టి వినాయక విగ్రహాం అంత ప్రాచుర్యం పొందుతుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం విద్యాధర పురంలోని లేబర్ కాలనీ గ్రౌండ్ లో డూండీ గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసి 72 అడుగుల వినాయక విగ్రహ నమూనా చిత్రపటాన్ని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు. ఈ ఏడాది శ్రీ విజయ మహాగణపతిగా డూండీ వినాయకుడు భక్తులకి దర్శనమివ్వనున్నాడు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ డూండీ గణేష్ సేవ సమితి కమిటీ సభ్యులతో కలిసి మట్టి వినాయక విగ్రహం నిర్మాణం పరిశీలించారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం నిర్విరామంగా జరగాలనే ఉద్దేశ్యంతో డూండీ గణేష్ సేవ సమితి వినాయక ఉత్సవాలు నిర్వహిస్తుందన్నారు. విఘ్నాలు తొలగించే ఆ వినాయకుడ్ని భక్తులు కొలిచేందుకు ప్రభుత్వం అన్ని రకాలు సహకరించిందన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా, పర్యావరణ హితంగా 72 అడుగుల మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేసిన డూండీ గణేష్ సేవ సమితిని అభినందించారు. వినాయక ఉత్సవాలకే కాదు, దసరా ఉత్సవాలకు కూడా ప్రభుత్వం ఘనంగా జరిపిస్తుందన్నారు.
అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా భారీ ఎత్తులో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సంకల్పించిన డూండీ గణేష్ సేవా సమితిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంతోపాటు ఆలయాలను అభివృద్ది చేయటం ఒక భాగంగా పెట్టుకున్నారని తెలిపార. పవిత్ర సంగమం దగ్గర ఇచ్చే నవహారతుల కార్యక్రమం త్వరలో ప్రారంభించేందు నిర్ణయం తీసుకున్నట్లు సూత్రప్రాయంగా తెలిపారు.
ఖైరతాబాద్ వినాయక విగ్రహం తయారు చేసే శిల్పులే ఈ భారీ మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేయటం ఎంతో సంతోషంగా వుందన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి రంగుల వేసి పూర్తిగా వినాయక విగ్రహాన్ని సిద్దం చేస్తారని చెప్పారన్నారు. సెప్టెంబర్ ఏడవ తారీఖు నుంచి సెప్టెంబర్ 16వ తారీకు వరకు నిర్వహించే ఈ ఉత్సవాలకు సహకారం అందించాలని ప్రభుత్వాన్ని కోరటం జరిగిందన్నారు. దేవదాయ శాఖ అండగా వుండటమే కాకుండా, ఈ విశాలమైన ప్రాంగణంలో రాష్ట్రంలో ఎనిమిది ప్రముఖ ఆలయాల నుంచి ఉత్సవ విగ్రహాలు తెప్పించి కళ్యాణం జరిపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.
అనంతరం రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షుడు, డూండీ గణేష్ సేవ సమితి కమిటీ సభ్యలు డూండీ రాకేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన విధంగా తిరుమల, కాణిపాకం, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, ఒంటిమిట్ట, మోపిదేవి ప్రముఖ దేవాలయాల నుంచి ఉత్సవ విగ్రహాలు ఈ ప్రాంగణానికి తీసుకువచ్చి కళ్యాణం జరిపించేందుకు ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సీఎం ఆదేశాల మేరకు సహకారం అందిస్తున్న దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారయణరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఇతర అధికారులకి దన్యవాదాలు తెలిపారు. హిందూ ధర్మాన్ని, హిందు సంప్రదాయాలను కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే వినాయక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో డూండీ గణేష్ సేవ సమితి నిర్వహకులు గడ్డం రవి, ముక్తేశ్వరరావు, పేరల రవి, ఆలపాటి సత్యనారాయణ, కె.డి.శ్రీనులతో పాటు టిడిపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎమ్.ఎస్.బేగ్ తదితరులు పాల్గొన్నారు.