-ఇసుక సరఫరాలలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించం..
-యార్డ్లలో టోకెన్లు లేని వాహనాలను గుర్తిస్తే సీజ్ చేయండి..
-కీసర స్టాక్ పాయింట్ ఇన్చార్జ్ సస్పెన్షన్.. జెసిబి కాంట్రాక్ట్ రద్దు..
-జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇసుక సరఫరా విధానంలో అత్యంత పారదర్శకతను పాటించాలని స్టాక్ యార్డ్ల వద్ద గట్టి నిఘా పెట్టాలని ఎటువంటి అవకతవకలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, టోకెన్లు లేని వాహనాలు స్టాక్ యార్డ్లలో గుర్తిస్తే తక్షణమే స్వాదీనం చేసుకుని స్టాక్ యార్డ్ ఇన్చార్జులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో ఇసుక సరఫరాపై రాష్ట్ర గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో వీడియోకాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం జిల్లా కలెక్టర్ డా. జి.సృజన జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానంలో మరింత పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పాటించడంతో పాటు ఇసుక సరఫరా పై నిరంతర నిఘా ఉంచాలన్నారు. కీసర, మొాగులూరు, చెవిటికల్లు, అనుమంచిపల్లి, పోలంపల్లి స్టాక్ పాయింట్ నుండి చేస్తున్న ఇసుక సరఫరాపై రెవెన్యూ, పోలీస్, ఇంటెలిజెన్స్, మైనింగ్ అధికారులు పూర్తి పర్యవేక్షణ చేయాలని సూచించారు. స్టాక్ యార్డ్ల వద్ద అక్రమాలు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలపై వాస్తవాలను పరిశీలించడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారుల నివేదికల ఆధారంగా కీసర, మొాగులూరు స్టాక్ పాయింట్ ఇన్చార్జులను తక్షణమే సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీనితో పాటు ఆయా స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్ చేస్తున్న జెసిబి మిషన్లకు సంబంధించిన కాంట్రాక్ట్ను రద్దు చేసి వారిని తొలగించాలన్నారు. స్టాక్ యార్డ్లలో ఇసుక సరఫరా, నిల్వలకు సంబంధించిన నివేదికలు ఎప్పటికప్పుడు ప్రదర్శించడంతో పాటు అన్లైన్లో ఉంచాలన్నారు. వెబ్సైట్లో రిజిస్టర్ అయిన వాహనాలకు మాత్రమే బుకింగ్ చేయాలని, ఇన్వాయిస్ లేని వాహనాలను స్టాక్పాయింట్ల వద్దకు అనుమతించవద్దని, టోకెన్లు లేకుండా ఇసుక నింపుతున్న వాహనాలను గుర్తిస్తే స్వాదీనం చేసుకుని చట్ట రిత్యా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇసుక స్టాక్ పాయింట్లలో ఎటువంటి ఆనధికార కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు తన దృష్టికి వస్తే ఎంతటి వారినైన ఉపేక్షించేది లేదన్నారు. బుకింగ్ చేసుకున్న క్వాంటిటికి మించి అధికలోడ్ చేస్తున్నట్లు గుర్తిస్తే చర్యలు తప్పవన్నారు. అధిక లోడింగ్ చేసినట్లు గుర్తించిన 21 వాహనాలపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఎప్పటికప్పుడు ఇసుక వాహనాలను సమీపంలోని వే బ్రిడ్జిల ద్వారా తూకాన్ని సరిచూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డా.జి. సృజన అధికారులను ఆదేశించారు.