– ఈ నెల 31వ తేదీనే పూర్తిస్థాయిలో పంపిణీకి కృషి చేయండి
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి నెలా ఒకటో తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని ఒకరోజు ముందుగానే ఈనెల 31వ తేదీన శనివారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభించి, ఒక్కరోజులోనే పూర్తిస్థాయిలో పంపిణీకి కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం డీఆర్డీఏ అధికారులు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే ఈనెల 31వ తేదీనే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అధికారులు సమన్వయంతో వ్యవహరించి పెన్షన్ల పంపిణీని సజావుగా నిర్వహించాలన్నారు. జిల్లాలో 2,33,501 పెన్షన్లకు సంబంధించి రూ. 98.58 కోట్ల మేర పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇళ్ల వద్దకు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొంటారని వివరించారు. పెన్షన్ల పంపిణీ జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు పర్యవేక్షించి, పంపిణీ సాఫీగా సాగేలా చూడాలని కలెక్టర్ సృజన ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్లో డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.