Breaking News

ప్రతీ ఒక్కరూ తమ తల్లితండ్రుల పేరుమీద మొక్కలు నాటాలి

-నాటిన మొక్కలు వృక్షాలు అయ్యేవరకు తల్లితండ్రుల్లా సంరక్షించాలి
-నూజివీడులో మినీ జూ, ఎకో టూరిజం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం -రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి

నూజివీడు /ఏలూరు,  నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ ఒక్కరూ తమ తల్లితండ్రుల పేరుమీద రెండు మొక్కలు నాటాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా నూజివీడు మండలం బత్తులవారిగూడెం లోని నగరవనం లో శుక్రవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తో కలిసి మంత్రి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన వనమహోత్సవ కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పార్థసారథి ముఖ్యఅతిధిగా పాల్గొంటూ తల్లితండ్రులు మనకి జన్మనిస్తే చెట్లు మనం బ్రతికేందుకు ప్రాణవాయువును ఇస్తున్నాయని, ప్రతీ ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ తల్లితండ్రుల పేరుమీద రెండు మొక్కలను నాటడంతో పాటు మన తల్లితండ్రులను ఎంత ఆదరణగా చూసి సంరక్షించుకుంటామో అదేవిధంగా నాటిన మొక్కలను వృక్షాలు అయ్యేవరకు పరిరక్షించాలన్నారు. భారతదేశం ఒక పుణ్య భూమి అని, కొండలు, అడవులు, నదులతో పాటు దేశంలో ఎన్నో సహజ వనరులు ఉన్నాయన్నారు. దేశంలో అటవీ ప్రాంతాలలో ఔషధ విలువలు కలిగిన వృక్షాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఔషధ విలువలు కలిగిన చెట్ల వేర్లతో భయంకరమైన కేన్సర్ వంటి వ్యాధులను కూడా నయం చేయవచ్చన్నారు. ప్రకృతి నుండి మనకు సహజంగా లభించే పళ్ళు, ఫలాలు వంటి వాటిని సద్వినియోగం చేసుకుంటే అనారోగ్య పరిస్థితులు దరిచేరవన్నారు. అడవుల పెంచడం, పర్యావరణ పరిరక్షణ, సహజవనరులను వినియోగం పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
నూజివీడు లో మినీ జంతుప్రదర్శన శాల, ఎకో టూరిజం: నూజివీడు లో మినీ జూ (జంతుప్రదర్శనశాల) ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపమని మంత్రి పార్థసారథి చెప్పారు. నూజివీడు నియోజకవర్గంలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉందని, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని, ఈ ప్రాంతంలో చెట్లను మరింత పెంచి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఎకో టూరిజం ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నగరవనంలో కూడా ప్రజలు పిల్లలతో వచ్చి సరదాగా గడిపే వాతావరణం ఏర్పాటుచేయాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులను కార్పొరేట్ సామాజిక బాధ్యత గా పలు పారిశ్రామిక సంస్థలు వారు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. నూజివీడు నియోజకవర్గంలోని అటవీ భూములకు సరైన సరిహద్దులు లేని కారణంగా అటవీ శాఖాధికారులకు, రైతులకు తరచూ తగాదాలు ఏర్పడుతున్నాయని, అధికారులు వెంటనే అటవీ ప్రాంతానికి ఖచ్చితమైన సరిహద్దులు నిర్ణయించి కంచెలు వేయాలని మంత్రి సూచించారు. ఆర్ ఐ ఎఫ్ ఆర్ భూములలో సంబంధిత రైతులు బోర్లు వేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని మంత్రి అధికారులను కోరారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఒక్కరోజే లక్ష మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ప్రస్తుత వర్షాకాలం మొక్కలు నాటేందుకు సరైన సమయమని, కార్తీక మాసంలోగా ప్రకృతి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా జిల్లాలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యావరణ సమతుల్యత లేని కారణంగా ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయని, పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకుని వారి తల్లి పేరుతో చెట్టును నాటి, అది వృక్షం అయ్యేవరకు పరిరక్షించాలన్నారు.
ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మహాయజ్ఞమని, దీనిలో ప్రతీ ఒక్కరూ పాలుపంచుకుని భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణాన్ని అందిద్దామన్నారు. గత ప్రభుత్వం చెట్లు నరకడమే పనిగా పెట్టుకున్నారని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు వన మహోత్సవం పేరుతో ఊరూరా వనాలు పెంచుతున్నారన్నారు.
జిల్లా అటవీ శాఖాధికారి రవీంద్ర దామా మాట్లాడుతూ జిల్లాలో 1. 40 హెక్టార్లలో అటవీ ప్రాంతం ఉందన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం 10 లక్షల మొక్కల పెంపకాన్ని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. శుక్రవారం ఒక్కరోజే లక్ష మొక్కలు నాటుతున్నామన్నారు. జిల్లాలో 3 పులులు గుర్తించామని, పాపికొండలులో “పులుల అభయారణ్యం” ఏర్పాటుచేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. జిల్లాలో నూజివీడు, ఉంగుటూరుమండలం ప్రకాశరావుపాలెం, చింతలపూడి లలో నగర వనాలు ఉన్నాయని డీఎఫ్ ఓ చెప్పారు.
ఈ సందర్భంగా వన మహోత్సవంపై ముద్రించిన గోడ పత్రికను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులకు, ప్రజలకు, విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రికి, ముఖ్యఅతిదులకు కొల్లేరు పక్షులతో ముద్రించిన జ్ఞాపికలను బహూకరించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని, మొక్కలను నాటి సంరక్షిస్తామని సభికులచే మంత్రి ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో నూజివీడు ఆర్డీఓ వై. భవానీశంకరి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ భాష, ఉద్యానవనాలు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహన్, డీపీవో తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, డ్వామా పీడీ పి . రాము, సర్పంచ్ లక్ష్మీకాంతమ్మ, స్థానిక నాయకులు బర్మా ఫణి బాబు, ప్రభృతులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *