-నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి ఉత్సవాలను పకడ్బందీగా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సజావుగా నిర్వహించాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. శనివారం ఉదయం స్థానిక తుదా సమావేశ మందిరంలో రానున్న వరసిద్ధి వినాయక ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం కార్యక్రమాల నిర్వహణపై నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ, నిర్వాహకులు తదితరులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుందామని అన్నారు. తిరుపతి నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు టీటీడీ సహకార సమన్వయంతో వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలని, అందరూ సహకరించాలని అన్నారు. మనమందరం బాధ్యతగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణానికి మేలు కలిగేలా చూడాల్సి ఉంటుందని , లక్షల విగ్రహాలు పూజింప బడతాయని మట్టి వినాయకుల నిమజ్జనం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో, డెకరేషన్ లైటింగ్ ఏర్పాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లీచింగ్, శానిటేషన్, త్రాగు నీరు, స్టేజి, లైటింగ్ ఏర్పాట్లు, బ్యారికేడింగ్ ఏర్పాటు పట్టిస్తంగా ఉండాలని తెలిపారు. నిమజ్జన కార్యక్రమం కొరకు నీటి నిల్వ తగినంత ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. వినాయక సాగర్, చెన్నాయ గుంట, దామినేడు వద్ద నిమజ్జనంలో ఎలాంటి అపశృతులు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని అన్నారు. ఆర్టీసీ వారు బస్ ట్రాఫిక్ రూట్ సమన్వయం పోలీస్ వారితో చేసుకోవాలని సూచించారు. అంబులెన్స్ ల ఏర్పాటు, ప్రథమ చికిత్స ఏర్పాటు ఉండాలని వైద్యాధికారులకు సూచించారు. ఇరిగేషన్ అధికారులు చెన్నాయ గుంట వద్ద కరకట్ట పరిశీలించాలని సూచించారు. ఏపీఎస్పీడిసిఎల్ వారు పవర్ కట్ లేకుండా చూడాలని, నిమజ్జన ప్రాంతంలో జనరేటర్ తదితర ఏర్పాట్లు ఉండాలని సూచించారు. మునిసిపల్ అధికారులు సమన్వయంతో వినాయక విగ్రహ ఏర్పాట్లు, నిమజ్జన ఏర్పాట్లు సామరస్యంగా ప్రశాంతంగా సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పండుగ వాతావరణంలో, భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, అధికారులు అప్రమత్తంగా బాధ్యతగా వ్యవహరించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తెజ్ రెడ్డి, తుడా సెక్రెటరీ వెంకట నారాయణ,మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, వెంకట్రామి రెడ్డి, హెల్త్ ఆఫీసర్ అన్వేష్ రెడ్డి, తిరుపతి వరసిద్ది వినాయక మహోత్సవ కమిటీ ప్రతినిధులు సామంచి శ్రీనివాస్, భాను ప్రకాష్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, ఆర్.సి మునికృష్ణ, మాగంటి గోపాల్ రెడ్డి, గుండాల గోపి నాథ్, అజయ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.