Breaking News

ఏలూరు జిల్లాలో వర్ష పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా

-ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రికి ముఖ్యమంత్రి ఆదేశం
-ఏలూరు జిల్లాలో వర్ష పరిస్థితిని మంత్రి పార్థసారథి ని టెలిఫోన్ ద్వారా ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
-జిల్లా యంత్రాంగాన్ని అపప్రమత్తం చేసి ఎటువంటి నష్టం సంభవించకుండా పటిష్టచర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రికి తెలియజేసిన మంత్రి పార్థసారథి

నూజివీడు/ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్త్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ని ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ని టెలిఫోన్ ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రికి మంత్రి పార్థసారధి తెలియజేస్తూ భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని మంత్రి చెప్పారు. ఏలూరు జిల్లా యంత్రాంగం అధికారులను ముందుగానే అప్రమత్తం చేయడంతో భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఎటువంటి నష్టం జరగకుండా చూడగలిగామని ఈ సందర్భంగా మంత్రి ముఖ్యమంత్రికి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి రెవిన్యూ కార్యాలయాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నామని, కాజ్ వే వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మండల ప్రత్యేక అధికారులు సంబంధిత మండలంల్లోనే బస ఉండి, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నూజివీడు మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. రాష్ట్ర విపత్తు నివారణ దళం ను కూడా నూజివీడు ప్రాంతంలో సిద్ధం చేశామన్నారు. 200 మందిని నూజివీడులో జిల్లాపరిషత్ బాలికల ఉన్నతపాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటుచేసి, భోజన, వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం, నాగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు నీటి మట్టం పెరుగుతున్న దృష్ట్యా ఆయా తీర ప్రాంతంలోని ప్రజలను అపప్రమత్తం చేశామని, ముంపునకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. జిల్లాలో పూరిగుడెసెలు, శిధిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి వాటిలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. వర్షాల కారణంగా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నామని, వర్ష సమయంలో విద్యుత్ స్తంబాలు తాకవద్దని, చెట్ల కింద నిలబడవద్దని ప్రజలకు అవగాహన కలిగించామన్నారు. మండల ప్రత్యేక అధికారులుగా నియమించిన జిల్లా అధికారులు వారి పరిధిలోని గ్రామాలలో విస్తృతంగా పర్యటించి ఎటువంటి నష్టాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారని, ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారని మంత్రి ముఖ్యమంత్రికి తెలియజేసారు. జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ముఖ్యమంత్రి మంత్రి పార్థసారథి కి సూచించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *