Breaking News

వరదకు ఎదురేది …

-వరద ప్రాంతాల్లో మంత్రి సవితమ్మ పర్యటన
-బోటులో వెళ్లి బాధితులను ఒడ్డుకు చేర్చిన మంత్రి
-నడుం లోతు నీటిలో బాధితులకు పరామర్శ
-అన్ని విధాలా ఆదుకుంటామంటూ భరోసా
-చంద్రబాబు స్ఫూర్తితో బాధితులకు అండగా ఉందామంటూ వైద్య సిబ్బందికి, అంగన్వాడీలకు మంత్రి సవిత సూచన

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఊళ్లకు ఊళ్లు మింగేసిన కృష్ణమ్మ ఉగ్రరూపంతో ఉప్పొంగుతోంది. గజ ఈతగాళ్ల సైతం కడలిలా ఎగిసి పడుతున్న కష్ణమ్మను చూసి నీరుగారిపోయారు. ఇవేవీ ఆమెను భయపట్టలేక పోయాయి… సీఎం చంద్రబాబు అప్పగించిన బాధ్యత… వరద ఉధృతిలో చిక్కుకున్న బాధితులను రక్షించాలనే ఆమె కర్తవ్యం ముందు ఉగ్ర కృష్ణమ్మ చిన్నబోయింది. కన్నీటి సంద్రంలో భవిష్యత్తు కొట్టుకుపోయిందని కన్నీరుమున్నీరవుతున్న ఆ బతుకుల్లో ఆమె మాటలు భరోసా నింపాయి. భయం లేదు… మేమున్నామన్న ఆ భరోసా.. కృష్ణమ్మ కడలిలో చిక్కుకున్న బాధితులకు ఆపన్నహస్తమైంది… మహామహులు సైతం వరద ఉధృతిని చూసి బెంబేలెత్తిపోయినా ఆమె వెరవలేదు. మొక్కవోని ధైర్యంతో… బోటు మీద వెళ్లి వరదలో చిక్కుకున్న వారినిని కృష్ణమ్మ ఒడ్డుకు చేర్చారు. ఇదీ పామర్రు, పెనమలూరులో రాష్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యుల ఎస్.సవితమ్మ పర్యటన దృశ్యాలు. గతంలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలను కృష్ణమ్మ ముంచేసింది. గంటల వ్యవధిలో విజయవాడ, కృష్ణా నదీపరివాహక ప్రాంతాల్లో తాము కట్టుకున్న కలల సౌధాలు, భవనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వేలాది మంది కృష్ణమ్మ వరద ఉధృతిలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు రెండ్రోజుల నుంచి విజయవాడ కలెక్టరేట్ నుంచి సమీక్షలు నిర్వహిస్తూ…వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి దిశా నిర్దేశం చేస్తున్నారు. పునరావాసా కేంద్రాలను ఏర్పాటుచేసి, బాధితులకు భోజనం, వసతి సౌకర్యం కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనల మేరకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత పెనమలూరు, పామర్రు ప్రాంతాల్లోని వరద ప్రాంతాల్లో పర్యటించారు. రామలింగేశ్వర్ నగర్, తాడిగడపలో మున్సిపాల్టీలో వడ్డేరు కాలనీ, హెచ్పీ గ్యాస్ గోడౌన్ కాలనీ, మాదు తిరుపతిరావునగర్ తదితర ప్రాంతాల్లో నడుం లోతుల్లో నీటిలో పర్యటించారు. వరద బాధితులకు బిస్కట్లు, రొట్టెలు పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరద ఉధృతి పెరిగే ప్రమాదముందని తక్షణమే ఇళ్లు ఖాళీ చేయాలని కోరారు. ప్రభుత్వం పునరావాసా కేంద్రాలు ఏర్పాటు చేసింద, భోజన, వసతి సౌకర్యా లు కల్పించిందని, వరదలు తగ్గే వరక అక్కడ ఉండాలని వరద బాధితులకు మంత్రి సవిత కోరారు.

వరదకు ఎదురీది…వరద బాధితులకు ఒడ్డుకు చేర్చి…
కేవలం పర్యటనలు, ఓదార్పు మాటలతో సరిపెట్టకుండా మంత్రి సవిత రంగంలోకి దిగారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదలో చిక్కుకున్న బాధితులను రక్షించడానికి స్వయంగా బోటులో వెళ్లి ఒడ్డుకు చేర్చారు. తాడిగడపలో పర్యటన అనంతరం అక్కడి నుంచి పెనమలూరులోని వరద ప్రాంతాల్లో మంత్రి సవిత పర్యటించారు. మంత్రిని చూసిన గణపతినగర్, శ్రీనగర్ కాలనీలోని ప్రజలు రక్షించాలంటూ కేకలు వేశారు. తొలుత శ్రీనగర్ కాలనీలో కాలనీ వాసులతో పాటు బాలింత, రెండు నెలల పసికందు కూడా వరద నీటిలో చిక్కుకున్నట్లు తెలిసిన మంత్రి సవిత… ఎస్డీఆర్ ఎఫ్ సిబ్బందితో మాట్లాడారు. వారు ఏర్పాటు చేసిన బోటులో స్వయంగా మంత్రి సైతం శ్రీనగర్ కాలనీలో పర్యటించారు. బోటులోనే ఇంటింటికీ వెళ్లి మంత్రి పాలు ప్యాకెట్లు అందజేశారు. చిన్నారులను, మహిళలను తాను ఎక్కిన బోటులోనే ఒడ్డుకు చేర్చారు. అక్కడి నుంచి గణపతి నగర్ చేరుకున్న మంత్రి..అక్కడ కూడా ఎస్డీఆర్ ఎఫ్ సిబ్బంది ఏర్పాటు చేసిన బోటులో వెళ్లి వరద బాధితులకు ఒడ్డుకు చేర్చారు. తిరుగు పయనంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కలిసి పెనమలూరులోని వరద ప్రాంతాల్లో భారీ పడవపై పర్యటించి, వరద బాధితులను పెద్ద సంఖ్యలో ఒడ్డుకు చేర్చారు.

చంద్రబాబు ఉన్నారు భయమొద్దు…
వరద బాధితులను ఆదుకోడానికి సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. పామర్రులోని వల్లూరుపాలెం, తొట్లవల్లూరు జెడ్పీ హైస్కూళ్లో ఏర్పాటు చేసిన పునరా వాసా కేంద్రాలను ఎమ్మెల్యే వర్ల కుమార రాజాతో కలిసి మంత్రి సందర్శించారు. కన్నీటి పర్యాంతమైన బాధితులను మంత్రి ఓదార్చారు. ‘ఏం భయపడాల్సిన అవసరంలేదని, సీఎం చంద్రబాబు మిమ్మళ్ని ఆదుకోడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, ముందు ప్రాణ నష్టం కలుగుకుండా చర్యలు తీసుకున్నా మని, రాబోయే రోజుల్లో ఆస్తి నష్టాలను అంచనా వేసి, నష్టపరిహారం కూడా చెల్లిస్తామని’ మంత్రి తెలిపారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పునరావాసా కేంద్రాల్లో రెండ్రో జులు సేద తీరాలని, సొంత గ్రామాలకు తప్పనిసరిగా తరలిస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కుమార రాజా మాట్లాడుతూ, మంత్ర సవితను చంద్రబాబు పంపారని, భయపడాల్సిన పనిలేదని అన్నారు. తాను కూడా 24 గంటలూ మీతోనే ఉంటానని, ఏ కష్టమొచ్చినా ఆదుకోడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

బాధితుల కోసం 24 గంటలూ పనిచేద్దాం…
పామర్రులోని వల్లూరుపాలెం, తొట్లవల్లూరు జెడ్పీ హైస్కూళ్లో ఏర్పాటు చేసిన పునరావాసా కేంద్రాలను పరిశీలించిన మంత్రి సవిత…అక్కడున్న వైద్య సిబ్బందితోనూ, అంగన్వాడీ కార్యకర్తలతోనూ మాట్లా డారు. బాధితులకు అండగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు రెండు రోజుల నుంచి నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారన్నారు. వైద్య సిబ్బంది, అంగన్వాడీలు కూడా చంద్రబాబు బాటలో నడుస్తూ, వరద బాధితులకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి కోరారు. మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ…బాధితుల్లో మనో ధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. వైద్య శిబిరాల్లో అందుబాటులో ఉంచిన మందులను పరిశీలించారు.

రైతులకు అండగా ఉంటాం
అనంతరం తొట్లవల్లూరులో తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. వరద బాధితుల కోసం రేయింబవళ్లు కృషి చేస్తున్నామన్నారు. పునరావాసా కేంద్రాలను ఏర్పాటు చేశామని, భోజనంతో పాటు వసతి సౌకర్యాలను ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు. పునరావాసా కేంద్రాల్లో వైద్య శిబి రాలను ఏర్పాటు చేశామన్నారు. వరదలు తగ్గగానే పంట నష్టాలతో ఆస్తి నష్టం లెక్కిస్తామన్నారు. బాధితులందరికీ న్యాయం చేయాలనే దృక్పథంతో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు. రైతులకు న్యాయం జరిగేలా పంట నష్టం వివరాలు అంచనా వేస్తామన్నారు. మంత్రి పర్యటనలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *