విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనరేట్ పరిధిలో నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. వరద ఉదృతిని పర్యవేక్షిస్తూ ఎన్.డి.ఆర్.ఎఫ్. మరియు ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలు, ఫైర్ మరియు పోలీసు లా అండ్ ఆర్డర్ అధికారులు మరియు సిబ్బంది సహకారంతో లోతట్టు ప్రాంతాలలో సహాయ కార్యక్రమాలు అందించే విధంగా మరియు నీట మునిగిన ప్రాంతాల నుండి ప్రజలను రక్షించి పునరావాసాలకు తరలించే సహాయక చర్యలను చేపట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో రెండవ రోజు సింగ్ నగర్, నున్న పరిసర ప్రాంతాలు ఇబ్రహీంపట్నం ఏరియాలలోని నీట మునిగిన ప్రాంతాల్లోకి స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో అధికారులకు సూచనలిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ క్రమంలో వరదలో చిక్కుకున్న 10నెలల బాలికను వారి కుటుంబ సభ్యులను బోట్ సహాయంతో స్వయంగా బయటకు తీసుకురావడం జరిగింది. మరియు, వృద్దులను, మహిళలను స్వయంగా రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించడం, సహాయక చర్యలలో స్వయం గా పాల్గొనడం జరిగింది.
అదేవిధంగా ఈ రోజు భవానీపురం, చిట్టీనగర్ మరియు వై.ఎస్.ఆర్ కాలనీ ఏరియాలలోని నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించి వారికి అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకుని అధికారులకు తగు సూచనలు అందించారు. ఈ సందర్భంగా అన్నిరకాల సహాయక చర్యలు మరియు వరదనీరు తగ్గడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, వరదనీరు క్రమంగా తగ్గుముఖం పడుతుందని, లోతట్టు ప్రాంతల ప్రజలు మరియు కొండ ప్రాంతాల్లో నివసించేవారు, మొదలగు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సైతం ముందస్తుగా చర్యలు తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.