-ఎసిఏ అధ్యక్షుడిగా ఎంపి కేశినేని శివనాథ్ ఎన్నిక
-ప్రకటించిన రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్
-తొలి నిర్ణయం…సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లకు విశాఖ స్టేడియం ఒక్కటే వేదిక కాగా, మంగళగిరి, కడప స్టేడియాల్లో కూడా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరిపించేందు కృషి చేస్తానని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు. ఎసిఏ ప్రత్యేక సర్వ సభ సమావేశం ఆదివారం బందరు రోడ్డులోని లెమన్ ట్రీ హోటల్ లో జరిగింది. ఏసిఏ నూతన అధ్యక్షుడిగా విజయవాడ ఎంపి, కర్నూల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. ఏసిఏ ఇతర పదువులకూ కేశినేని శివనాథ్ ప్యానల్ ఎన్నికైంది. ఏసిఏ అధ్యక్ష పదవి జరిగిన ఎన్నికల్లో ఎంపి కేశినేని శివనాథ్ ప్యానల్ కు పోటీగా మరో ప్యానల్ ఎవరు నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో ఎసిఏ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు అయింది. ఇక కేశినేని శివనాథ్ ప్యానెల్ లో ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణు కుమార్ రాజు,కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ గా గౌరు విష్ణు తేజ్ ఎన్నికయ్యారు.
ఎసిఏ ప్రత్యేక సర్వ సభ సమావేశం అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఏసిఏ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగటం శుభపరిణామం అన్నారు. పలు క్రికెట్ అసోసియేషన్స్ లో ఎన్నికలు రాజకీయ జోక్యం వుంటుందని…అలాంటిదేమి లేకుండా ఈ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయన్నారు. ఏసిఏ అధ్యక్షుడిగా వరద బాధితుల సహాయర్ధం సీఎం రిలీప్ ఫండ్ కి కోటి రూపాయలు ఇచ్చేందుకు తొలి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఏసిఏ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు కోటి రూపాయల విరాళం అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో యువత అందరికీ క్రికెట్ వసతులు అందుబాటులో వుండే విధంగా కృషి చేస్తామన్నారు. టాలెంట్ వుండి అవకాశాలు అందుకోలేకపోతున్న క్రికెటర్స్ అందరికీ ఏసిఏ మద్దతుగా నిలబడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువకుల్లో వున్న క్రికెట్ టాలెంట్ ను వెలుగులోకి తీసుకువస్తామన్నారు. అనంతరం ఏసిఏ సభ్యులు ఎంపి కేశినేని శివనాథ్ ను అభినందించారు.