-కలెక్టర్ పి.ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల్లో సిమెంట్ రహదారులు, డ్రెయిన్స్ పనులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ డ్వామా పనులు పురోగతి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతిపాదించే పనుల విషయంలో సమగ్ర నివేదిక సిద్ధం చేసుకుని మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ఆయా పనులను చేపట్టవలసి ఉంటుందని పేర్కొన్నారు. సాంకేతిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని ప్రాజెక్టు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆయా పనులకి చెందిన పరిపాలన ఆమోదం తో మాత్రమే పనులు పూర్తి చెయ్యాల్సి ఉంటుందన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 966 పనులకు గాను రూ.89 కోట్ల 75 లక్షలు మంజూరు తెలిపారు. ఆయా పనుల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన 83 పనులను రూ.9 కోట్ల రూ.59 లక్షలతో పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. నాలుగు కోట్ల రూ.77 లక్షల వ్యయం తో 36 పనులు వివిధ దశలో ఉన్నాయని తెలిపారు. ఇంకా మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారు లను ఆదేశించారు. రానున్న రోజుల్లో ప్రతిపాదించే పనుల్లో సిమెంట్ రోడ్లు , డ్రైనేజీ, అనుసంధాన రహదారుల (లింక్) పనులని చేపట్టడం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. గ్రామ సభల్లో నిర్ధారించిన పనులకు అత్యంత ప్రాధాన్య ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు . ఈ సమావేశంలో డ్వామా పీడీ ఆర్. శ్రీరాములు నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ డి బాల శంకర రావు, ఇతర శాఖల అధికారులు, డ్వామా సిబ్బంది పాల్గొన్నారు.