Breaking News

భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టం అంచనా వేసేందుకు రాష్ట్రంలో 2 రోజుల పాటు కేంద్ర బృందం పర్యటన

-తొలిరోజు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో భేటీ
-వివిధ శాఖల్లో జరిగిన నష్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర అధికారులు
-ప్రాథమిక అంచనాగా రూ. 6,880 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి వెల్లడించిన రాష్ట్ర ఉన్నతాధికారులు
-రాష్ట్ర అధికారుల నుండి సమగ్ర నివేదికను తీసుకున్న అనంతరం 2 బృందాలుగా విడిపోయి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సెంట్రల్ టీం
-గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఒక టీం, కృష్ణా జిల్లాలో పర్యటించిన మరో టీం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టం అంచనా వేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల్లో జరిగిన నష్టంపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో దాదాపు రెండున్నర గంటల పాటు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్‌ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన బృందం సమావేశమైంది. జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు కేంద్ర బృందానికి వరద పరిస్థితిని వివరించారు. అదే విధంగా రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా వరద నష్టం తీవ్రతను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల వీడియోలను, ఫోటోలను కేంద్ర బృందానికి చూపిస్తూ రూ. 6,880 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు ఉన్నతాధికారులు కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం ఏపీఎస్డిఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సెంట్రల్ టీం పరిశీలించింది.

రాష్ట్ర ఉన్నతాధికారుల నుండి సమగ్ర నివేదికను తీసుకున్న అనంతరం కేంద్ర బృందం రెండు టీమ్ లుగా విడిపోయి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఒక బృందం గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తే మరో బృందం కృష్ణా జిల్లాలో పర్యటించింది. కేంద్ర బృందం పర్యటన రాష్ట్రంలో రెండు రోజుల పాటు కొనసాగనుంది.

ఈ సందర్భంగా సమావేశంలో వరద పరిస్థితి, నష్టం అంచనా, ప్రధానంగా వ్యవసాయం, హార్టికల్చర్, పశు సంవర్థక, మత్స్య, పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ అండ్ బి రోడ్లు, నీటి వనరులు, గ్రామీణ త్రాగునీటి సరఫరా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల్లో సంభవించిన నష్టాలపై కేంద్ర బృందానికి రాష్ట్ర ఉన్నతాధికారులు సుదీర్ఘంగా వివరించారు. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీలో ఎన్నడూ రానంతగా కృష్ణా నదికి వరద వచ్చిందని తెలిపారు. వరదల వల్ల ఏపీకి అపార నష్టం సంభవించిందని వివరించారు.. వరదలు, భారీ వర్షాల ధాటికి 32 వార్డులు, 2 గ్రామాలు, 161 సచివాలయాల పరిధిలో దాదాపు 10.63 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని తెలిపారు.

రాష్ట్రంలో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం (7) జిల్లాలు, 108 మండలాలు, 337 గ్రామాలు ప్రభావితం అయ్యాయని పేర్కొన్నారు. 246 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 45,855 మంది ప్రజలతో పాటు 522 మంది దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. 28 అంబులెన్స్ లు, 199 మెడికల్ క్యాంపుల ఏర్పాటు ద్వారా 1,24,916 మంది ప్రజలకు అత్యవసర వైద్య సాయం అందించామని వివరించారు.

శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ లు వరద నీటితో నిండాయని సెంట్రల్ టీంకు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా డెల్టా మీదుగా కొల్లేరు సరస్సులో కలిసే బుడమేరు ఉప్పొంగిన కారణంగా ముంపుకు గురైన విజయవాడ నగరం పరిస్థితిని వివరించారు. బుడమేరుకు సామర్థ్యానికి మించి నీరు రావడం, గండ్లు పడటం, ప్రవాహానికి ఆటంకాలు కలగడం, విజయవాడ బ్యారేజ్ కు రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కులు వరద నీరు రావడం తదితర కారణాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. పంటలు, రోడ్లు, విద్యుత్, ఇరిగేషన్ వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర బృందానికి తెలిపారు.

గత 10 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వరద సహాయక, పునరావాస చర్యలను తెలుపుతూ, ముఖ్యమంత్రి సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగం అహర్నిశలు పని చేసిన తీరును సెంట్రల్ టీం కు వివరించారు. 26 NDRF, 22 SDRF, 2 నేవీ బృందాలు, 6 హెలికాఫ్టర్లు, 212 బోట్లు, 488 గజ ఈతగాళ్లు, 606 ట్రాక్టర్లు, 330 బస్సులు,92 ఆటో రిక్షాలు, 162 చిన్న, పెద్ద వాహనాలు, 32 జేసీబీలు, 188 టిప్పర్లు, ట్యాంకర్లు, 59 డ్రోన్ల సాయంతో సహాయక చర్యలు త్వరితగతిన చేపట్టామని కేంద్ర బృందానికి వివరించారు.

డ్రోన్లు, హెలికాప్టర్ లు, ఇతర వాహనాలు, సిబ్బంది ద్వారా బాధిత ప్రజలకు 3 పూటలా అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనం కోసం 1 కోటి 14 లక్షల 48 వేల 410 ఆహార ప్యాకెట్లు, 1 కోటి 12 లక్షల 91 వేల 296 త్రాగునీటి ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, 35,18,819 పాల ప్యాకెట్స్, 46,78,212 బిస్కెట్ ప్యాకెట్ లు, 4,23,800 కోడి గుడ్లు, 3,40,483 క్యాండిల్స్, 2,03,710 అగ్గిపెట్టెలు, దాదాపు 3385 క్వింటాళ్ల కూరగాయలు, 2,06,770 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామన్నారు. పూర్తిగా నీటి కనెక్షన్లు పునరిద్ధరించామన్నారు. 7088 మంది పారిశుద్ధ్య సిబ్బందితో 8692 టన్నుల ఘన వ్యర్థాలను తరలించామన్నారు. సచివాలయాల్లో 100 శాతం శానిటేషన్ ప్రక్రియ దిగ్విజయంగా పూర్తిచేశామన్నారు. 100 శాతం విద్యుత్ కనెక్షన్ల(2,49,825) పునరుద్ధరణ ప్రక్రియ విజయవంతంగా చేపట్టామన్నారు. త్వరతగతిన విద్యుత్ పునరుద్దరించామని, పారిశుద్ధ్య పనులు చేపట్టామని పేర్కొన్నారు.

2.06 లక్షల హెక్టార్లో వ్యవసాయ పంట, 19,686 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. తద్వారా దాదాపు 3 లక్షల మంది రైతులు నష్టపోయారని తెలిపారు. రోడ్లు భారీగా దెబ్బతిన్నాయని తద్వారా వేల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇళ్లలో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు, గృహోపకరణాలను సిబ్బందితో మరమ్మత్తులు చేయిస్తున్నామని వివరించారు.

తొలిరోజు పర్యటనలో భాగంగా ఒక టీం వ్యవసాయశాఖ, రైతు సంక్షేమం సంచాలకులు డా.ఎ.ఎల్. వాగ్మేర్ నేతృత్వంలో నేడు బాపట్ల, గుంటూరు జిల్లాలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను, జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించింది. బాపట్ల జిల్లా వేమూరు, కొల్లూరు మండలం ఈపురులంక, అరవింద వారథి, పెసర్లంక, నక్కపాయ, పల్లెపాలెంలోని ఓలేరు, రావి అనంతవరం, కనగాలలో పరిశీలించి వరద బాధితులతో సెంట్రల్ టీం సభ్యులు మాట్లాడారు. అనంతరం గుంటూరుకు చేరుకుంది.

మరోటీం కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని యనమలకుదురులో దెబ్బతిన్న ఆర్ డబ్ల్యూఎస్, సీపీ డబ్ల్యూ ఎస్ స్కీం లను పరిశీలించింది. కంకిపాడు మండలంలోని పెదపులిపాక గ్రామంలో దెబ్బతిన్న గృహాలు, ఉద్యాన పంటలను పరిశీలింది. పెనమలూరు మండలం చోడవరం, కంకిపాడు మండలం మద్దూరు గ్రామాల్లో దెబ్బతిన్న వ్యవసాయ పంటల పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు.. అనంతరం తోట్లవల్లూరు మండలం రొయ్యూరు లో దెబ్బతిన్న కంకిపాడు – రొయ్యూరు రహదారి పరిశీలించింది. అనంతరం రోడ్డు మార్గం గుండా పామర్రు మీదుగా గుడివాడ మండలంలోని నందివాడకు చేరుకొని క్షేత్ర స్థాయిలో పర్యటించి నీట మునిగిన ప్రాంతాల పరిశీలన చేసింది.

కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్‌ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని బృందంలో వ్యవసాయశాఖ, రైతు సంక్షేమం సంచాలకులు(మహారాష్ట్ర) డా.ఎ.ఎల్. వాగ్మేర్, ఉపరితల రవాణాశాఖ చీఫ్‌ ఇంజనీరు రాకేష్‌కుమార్‌ (విజయవాడ), ఆర్థిక శాఖ కన్సల్టెంట్(FCD) ఆర్.బి.కౌల్(న్యూఢిల్లీ), గ్రామీణాభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌.వి.ఎస్‌.పి. శర్మ ఉన్నారు.

ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్.పి.సిసోడియా, సీనియర్ ఐఏఎస్ అధికారులు అనిల్ కుమార్ సింఘాల్, విజయానంద్, శేషగిరిరావు, ఢిల్లీ రావు, విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్, ఏపీఎస్ఎండీఏ మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ రోణంకి కూర్మనాథ్, అన్ని శాఖల ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *