-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్
-సెప్టెంబర్14వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు జరిగే స్వచ్ఛతా హి సేవ కార్యక్రమo పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తిరుపతి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్, డిప్యూటీ కమిషనర్ అమరయ్య మరియు సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 14 వ తేది నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు 2024 లో స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత అను నినాదంతో ఈ స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం పై ప్రజలకు మరింత అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం, శ్రమదానం ద్వారా చెరువుల కుంటల వద్ద వ్యర్ధపదార్థాలు తొలగింపు వంటి కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. మండల పరిషత్ అధికారులు, పంచాయతీ అధికారులు పంచాయతీ కార్యదర్శులను సమన్వయo చేసుకుంటూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు.
విసి అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…జిల్లాలో ఈనెల 14వ తేది నుంచి అక్టోబర్ 1 వ తేది వరకు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా ర్యాలీ, మారథాన్ రన్, వర్క్ షాపులు, మొదలగు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 17వ తేదీ నుంచి సంపూర్ణ స్వచ్ఛత కార్యక్రమం కింద అన్ని మున్సిపాల్టీల్లో మరియు అన్ని గ్రామ పంచాయతీలలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు, అన్ని చోట్ల శ్రమదానం కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు , రైల్వేస్టేషన్లు,చెత్త కుప్పలు, నల్లాల చుట్టుపక్కల మొదలగు ప్రదేశాలలో మెగా శుభ్రత డ్రైవ్ లు నిర్వహించాలన్నారు. ఈ మెగా శుభ్రత డ్రైవ్లు చాలా యాక్టివ్ గా నిర్వహించాలన్నారు. ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లు , విస్తరణాధికారులు మరియు సంబంధిత అధికారులు గ్రామ స్థాయి సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్వచ్ఛతా హి సేవ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. సఫాయి కర్మచారులకు సేఫ్టీ పరికరాలు అందించడం, ఆరోగ్య సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్డీవో సుశీల దేవి, డిప్యూటీ సీఈఓ ఆదిశేషారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.