-వారికి నిర్బంధ విద్య ను అమలు చేయాలి
-డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె ప్రకాష్ బాబు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రకాష్ బాబు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కార్మిక శాఖ మరియు ఇతర శాఖల వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కార్యదర్శి ప్రకాష్ బాబు మాట్లాడుతూ 6 నుండి 14 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు ఉచిత నిర్భంద విద్య పొందడం వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ఈ వయస్సులో ఉన్న పిల్లలను కార్మికులుగా మార్చడం చట్ట రీత్యా నేరం, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు. పిల్లలు విద్యాభ్యాసానికి దూరం కాకూడదని, వివిధ కారణాల చేత ప్రాధమిక విద్యకు దూరమవుతున్న పిల్లలను గుర్తించి వారిని బడికి పంపించే దిశగా చర్యలు ముమ్మరం చేయాలన్నారు.
ఈ మేరకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు ప్రకాష్ బాబు పలు సూచనలు చేశారు. వివిధ శాఖల సమన్వయ కృషితో పిల్లలను కాపాడి వారికి అవసరమైన సహాయం అందించాలని పేర్కొన్నారు. పిల్లల హక్కులకు భంగం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, పిల్లల భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు, వ్యవస్థలు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పిల్లలందరికి మంచి విద్య, స్వేచ్ఛగా జీవించే పరిస్థితులను కల్పించడం అందరి బాధ్యత అని న్యాయమూర్తి తెలియజేశారు. పిల్లలకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవల గురించి వివరించారు, ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలన్నారు.
ఈ సమావేశంలో రాజమహేంద్రవరం అడిషనల్ మున్సిపల్ కమిషనర్ పి.ఎమ్. సత్యవేణి , జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె.విజయ కుమారి,అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బి.ఎస్.ఎమ్.వల్లి , బాలల సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ పి.సూర్య ప్రభావతీ , రెవెన్యూ శాఖ అధికార్లు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికార్లు, కార్మిక శాఖ అధికార్లు, విద్యా శాఖ అధికార్లు,పోలీసు అదికార్లు, తదితర శాఖల అధికార్లు, ఎనిఓ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.