విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయని రుణాల రీషెడ్యూలింగ్ అవకాశం కల్పించాయని దీనిపై సంబంధిత బ్యాంకు బ్రాంచీలను సంప్రదించి లబ్ది పొందాలని అడిషనల్ సెక్రటరీ (ఫైనాన్స్) జె. నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
రుణాల చెల్లింపులకు సంబంధించి ఏడాది పాటు మారటోరియం సౌకర్యం కల్పించాయని. పంట రుణాలు, ఆటో రిక్షా, ద్విచక్రవాహనాల రుణాలు; చిన్న వ్యాపార, వాణిజ్య సంస్థలు, కిరాణా షాపులు, హోటళ్లు, ఇతర చిన్న పరిశ్రమలకు ఈ మారటోరియం వర్తిస్తుందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వరద ప్రభావిత 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు ఈ సౌకర్యం వర్తిస్తుందన్నారు. 179 సచివాలయాల పరిధిలోని గ్రౌండ్ఫ్లోర్ కుటుంబాలు రూ. 50 వేల వినియోగ రుణాలు (consumption loans) పొందవచ్చునని, మొదటి అంతస్తు, ఆపై అంతస్తులో ఉన్న కుటుంబాలు రూ. 25 వేల వినియోగ రుణాలు (consumption loans) పొందొచ్చు నన్నారు. ఈ రుణాలకు 3 నెలల మారటోరియం ఉంటుందని. 36 నెలల్లో రుణాలను తిరిగిచెల్లించొచ్చు నన్నారు. బ్యాంకులను సంప్రదించి అవకాశాలను ఉపయోగించుకోవాలన్నారు. అవసరం మేరకు కొత్తగా పంట రుణాలు పొందొచ్చునని. అదే విధంగా ఆటోరిక్షాలు, ద్విచక్ర వాహనాల రుణాలు పొందొచ్చు నన్నారు. చిన్న వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా పెట్టుబడికోసం కొత్త రుణాలు పొందొచ్చునని ఈ రుణాలు పొందేందుకు కొత్తగా కొల్లేటరల్ అవసరం లేదని అడిషనల్ సెక్రటరీ (ఫైనాన్స్ )జే. నివాస్ ఆ ప్రకటనలో తెలిపారు.