Breaking News

ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటింటికి తిరిగి ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను సేకరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం అమలులో భాగంగా గృహాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ షాపులు, ఎలక్ట్రికల్ వస్తువుల అమ్మకపు షాపుల నుండి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించాలని, ఇందుకు కరపత్రాలను ముద్రించి ప్రజలకు అర్థమైన రీతిలో ఎలక్ట్రానిక్ వ్యర్ధాలపై అవగాహన కల్పించాలన్నారు.

పారిశుద్ధ్య కార్మికులను ఇంటింటికి పంపించి పనికిరాని కంప్యూటర్లు, లాప్టాప్ లు, టెలివిజన్లు, ఫ్రిజ్లు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్థాలను సేకరించి ఈ నెల 27వ తేదీ కల్లా జిల్లా కేంద్రానికి చేర్చే విధంగా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి సేకరించిన ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను రీసైక్లింగ్ కోసం సంబంధిత పరిశ్రమకు పంపడం జరుగుతుందన్నారు. ఎల్ఈడి, సిఎఫ్ఎల్ బల్బులు ట్యూబ్ లైట్లు, బ్యాటరీలు మినహాయించాలని, నిపుణుల ఆధ్వర్యంలో వాటిని ప్రత్యేకంగా సేకరించి తరలించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రేపటి నుంచి వారం రోజుల పాటు సచివాలయం సిబ్బంది చేత ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు, కరపత్రాలను ప్రజలకు అందించే విధంగా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ క్రమంలో సచివాలయ సిబ్బంది ఇంటింటిని ఎలాగూ సందర్శిస్తారు గనుక, అదే సమయంలో ప్రజలకు సౌర విద్యుత్ వినియోగం పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో డిపిఓ నాగేశ్వర్ నాయక్, ఎన్ఐసి ఏడిఐఓ సెల్వినా పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *