-జలధార- జలహారతి ద్వారా తొండమనాడు పంచాయతీ లో 28 నీటి సంరక్షణ పనులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఒకప్పుడు పూడికతో మూసుకుపోయి నీటి ప్రవాహం లేక వెలవెలబోయిన కాలువలు… నేడు మళ్లీ జీవం పొందే అవకాశం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలధార–జలహారతి కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణకు కొత్త దిశను చూపిస్తోంది. తిరుపతి జిల్లాలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో తొండమనాడు చెరువు నుండి పేటవరువ కాలువ పనులు కేవలం నీటి వనరుల పునరుద్ధరణకే పరిమితం కాకుండా, వందల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఏర్పడడంతో రైతుల ఆశలకు ఊపిరి పోస్తున్నాయి. అదే సమయంలో గ్రామీణ ఉపాధి వేతనదారులకు తమ సొంత ఊరిలోనే ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి–ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
జలాధార – జల హారతి కార్యక్రమాన్ని విబి – జి రామ్ – జి పథకానికి అనుసంధానం చేస్తూ వంద రోజుల పని దినాలను 125 రోజులకు పెంచడం ఉపాధి వేతనదారులకు ఒక వరంలా మారింది.
నీటి సంరక్షణలో ముందడుగు
తిరుపతి జిల్లాలో జలధార – జల హారతి క్రింద భూగర్భ జలాలు పెంపు చేసే పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శ్రీకాళహస్తి మండలం, తొండమనాడు గ్రామపంచాయతీలో జలధార కార్యక్రమం కింద 4 నీటి సంరక్షణ కుంటలు,రెండు ఫారం పాండ్లు, 9 ఫీడర్ చానల్స్, 13 పంట కాలువ పనులను చేపట్టారు. తొండమనాడు చెరువు నుండి పేటవరువ కాలువ ద్వారా చుక్కనిడిగల్లు చెరువులోకి నీరు చేరుతుంది. 65 మంది ఉపాధి వేతనదారుల ద్వారా మూడు లక్షల 75 వేల రూపాయల అంచనా వ్యయంతో సుమారు రెండు కిలోమీటర్ల పొడవు గల ఈ కాలువ పనులను గత వారం రోజుల నుండి చేపడుతున్నారు.
పంటల పుష్కల ఫలితం
ఈ నీటి సంరక్షణ పనుల ద్వారా భూగర్భ జలాల సామర్థ్యం పెరిగి బొక్కసం పాళ్యం, ఎగువ వీధి, తొండమనాడు, పుల్లారెడ్డి కండ్రిగ పంచాయతీలలోని రైతులకు చెందిన సుమారు 300 ఎకరాలకు పైగా గల భూములకు సాగునీరు అందుతుంది. తద్వారా పూల తోటలు, వరి, వేరుశనగ పంటలను సాగు చేసుకుంటున్నారు. తమ స్వంత గ్రామంలో ఉపాధి దొరకడంతో ఉపాధి వేతనాదారులకు స్వాంతన చేకూరింది.
Prajavartha Online Telugu News