-మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు పూర్తిస్థాయి సేవలకు త్వరితగతిన చర్యలు : కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అధికారులకు సూచించారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిని సోమవారం సందర్శించిన ఆయన ఎయిమ్స్ పదవ స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శించి, రోగులతో మాట్లాడిన ఆయన, ఎయిమ్స్ లో అందుతున్న సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్ లో నూతనంగా ప్రవేశపెట్టిన పలు సేవలను కేంద్ర కార్యదర్శి ఈ సందర్భంగా ప్రారంభించారు. తక్కువ ధరకే నాణ్యమైన మందులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రధాన మంత్రి భారతీయ జన ఔషది పరియోజన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సెంట్రల్ స్టెరాయిల్ సప్లై విభాగాన్ని (central sterile services department) , క్రిటికల్ కేర్ యూనిట్ ను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం మంగళగిరి గణపతినగర్ లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన రాష్ట్రంలోనే తొలి ఎన్కాస్ (ENCOS) సర్టిఫికెట్ పొందిన ఈ కేంద్రంలో అందుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిమ్స్ లో అందుబాటులోకి తీసుకువచ్చిన సౌకర్యాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.