-ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం ప్రకటించడం పట్ల హర్షం
-ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు
-కేంద్ర సాయంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అమరావతి రాజధాని అభివృద్ది కోసం, కేంద్ర బడ్జెట్ లో ఎపికి ప్రత్యేక సాయం కింద 15 వేల కోట్ల రూపాయలు సాయం ప్రకటించటం పట్ల విజయవాడ ఎం.పి కేశినేని శివనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిలబెట్టుకున్నారు. గత ఐదేళ్ల కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఇంత ఎక్కువగా మాట్లాడలేదన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలు ఫలించాయన్నారు. ఏపీపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రత్యేక ధన్యవాదాలు ఎక్స్ ద్వారా (ట్విట్టర్) తెలియజేశారు.
రాష్ట్ర విభజన తర్వాత గత ఐదేళ్ల వైకాపా పాలనలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేంద్ర సాయంతో పుంజుకుంటుందన్నారు. ప్రపంచస్థాయిలో నిర్మించాలనుకునే అమరావతి రాజధాని నిర్మాణం దిశగా అడుగులు పడడానికి కేంద్ర బడ్జెట్ ఉపకరిస్తుందని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేంద్ర పథకాలు ఊతమిస్తాయని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం మరోసారి స్పష్టంగా హామీ ఇవ్వడం శుభ పరిణామమన్నారు. అలాగే అవసరాన్ని బట్టి వివిధ ఏజెన్సీల ద్వారా మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇవ్వటం రాష్ట్రం పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం నిధులు మంజూరు చేయటం ఆ జిల్లాలు అభివృద్దికి దోహదపడుతుందన్నారు.
అలాగే విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తానని చెప్పటంతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుందన్నారు. అలాగే హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు… విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి , . విశాఖ – చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు కేటాయింపు పై ఎంపి కేశినేని శివనాథ్ రాష్ట్ర ప్రజల తరుఫున కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.