-సమస్యకు పరిష్కారం చూపేందుకు భాగస్వాములతో కమిటీ ఏర్పాటు
-ప్రస్తుత సమస్య పరిష్కారం చూపడం, భవిష్యత్ ప్రణాళిక అందించడం కోసం కమిటీ
-100 కౌంట్ రొయ్యలకు రూ. 220 కన్నా తగ్గించొద్దని కొనుగోలుదారులకు నిర్ధేశం
-రొయ్యల చెరువులకు ఫ్రెష్ వాటర్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన ముఖ్యమంత్రి
-సచివాలయంలో ఆక్వా రంగ భాగస్వాములతో రెండున్నర గంటల పాటు చర్చలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త
అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వారంగాన్ని ఆదుకునే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష చేశారు. రాష్ట్ర జీడీపీలో మత్స్య రంగం కీలకమైన భూమిక పోషిస్తుందని… సుంకాల కారణంగా సంక్షోభం ముంగిట ఉన్న ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. సమస్యకు పరిష్కారం చూపేందుకు భాగస్వాములతో కమిటీ ఏర్పాటు చేద్దామని సిఎం ప్రతిపాదించారు. ప్రస్తుత సమస్యకు పరిష్కారం, భవిష్యత్ కు అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు కమిటీ సూచనలు చేయాలని సిఎం అన్నారు. ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, భాగస్వాములు, ఎంపెడా ప్రతినిధులు, ఎగుమతిదారులతో కమిటీ ఏర్పాటు చేసి మరింత లోతుగా సమస్యపై చర్చించి పరిష్కారం చూపేందుకు అవసరమైన సూచనలు ఈ కమిటీ చేయనుంది. ఈ కమిటీ సూచనల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుంది. అమెరికా ప్రభుత్వ కొత్త సుంకాల కారణంగా ఎపిలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆక్వా రైతులు, ఆక్వా రంగ భాగస్వాములు, ఎగుమతి దారులు, ప్రభుత్వ అధికారులతో చంద్రబాబు చర్చించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి అభిప్రాయలను తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించడానికి ఉన్న అవకాశాలపై వారితో మాట్లాడారు. ఆక్వా సాగులో 3 లక్షల మంది రైతులు ఉన్నారని… అలాగే, ఈ రంగం పై ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 50 లక్షల మంది ఆధారపడి ఉన్నారని వివరించారు. ఇప్పటికే అనేక సమస్యలతో కుదేలవుతున్న ఆక్వా రంగానికి కొత్త సుంకాలు మరింత నష్టం చేస్తాయని రైతులు, ఎగుమతి దారులు తెలిపారు. ఈక్విడార్ వంటి దేశాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. అమెరికాతో కేంద్ర ప్రభుత్వం సత్వర సంప్రదింపులు జరిపేలా కేంద్రంతో మాట్లాడనున్నారు.
అనూహ్య సమస్య… మద్దతుగా ఉంటాం
ఆక్వా రంగానికి ఇప్పుడు వచ్చింది ఊహించని, అనూహ్య సమస్య అని…దీనికి భయపడిపోకుండా…అంతా కలిసి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని ముఖ్యమంత్రి అన్నారు. సమన్వయంతో ఉంటేనే ఆక్వా రంగం ముందుకు సాగుతుందని సిఎం అన్నారు. రైతులకు నమ్మకాన్ని కల్గించాల్సిన అవసరం ఉందని సిఎం అన్నారు. ఆక్వాకు ఫ్రెష్ వాటర్ ఇవ్వడం వల్ల వైరస్ లు, వ్యాధులు తగ్గి…పంట నాణ్యత మెరుగుపడుతుందని రైతులు చెప్పగా….దీనికి సిఎం అంగీకారం తెలిపారు. గిట్టుబాటు ధర తగ్గకుండా చూడాలని కోరగా….100 కౌంట్ రొయ్యలకు రూ.220 ధరకు కొనుగోలు చేయాలని వ్యాపారులకు నిర్దేశించారు. దీనికి వ్యాపారులు కూడా సహకరించాలని అన్నారు. సౌత్ కొరియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయని ఎగుమతి దారులు చెప్పగా… ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడతామని సిఎం అన్నారు. ఇప్పటికే లేఖ ద్వారా కేంద్రం దృష్టికి తెచ్చామని… కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని అన్నారు. ఆక్వాలో భాగస్వాములుగా ఉన్న అన్ని వర్గాలు కలిసి సమిష్టిగా అడుగువేస్తేనే… ఈ రంగం నిలబడుతుందని సిఎం అన్నారు.