-యంపీపీ గద్దే పుష్పరాణి
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి త్రాగునీటిని అందించాలన్నదే జలజీవన్ ముఖ్యోద్దేశ్యమని యంపీపీ గద్దే పుష్పరాణి అన్నారు. గుడివాడ రూరల్ మండలం శేరే వేల్పూరులో సోమవారం జలజీవన్ మిషన్ గ్రామ సభను యంపీడీవో ఏ వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించగా యంపీపీ గద్దే పుష్పరాణి, జలజీవన్ మిషన్ ప్రతినిధి అధికారులు పాల్గొని గ్రామస్థులకు తాగునీటి వినియోగం పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా యంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి కుటుంబానికి సురక్షితమైన త్రాగునీటిని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా జలజీవన్ మిషన్ పథకం లో భాగగా గుడివాడ రూరల్ మండలంలో మొదటి విడతగా శేరేవేల్పూరు, సిద్దాంతం గ్రామాలను హర్ ఘర్ జల్ గ్రామాలుగా ప్రకటించారన్నారు. యంపీడీవో ఏ.వెంకట రమణ మాట్లాడుతూ కుళాయులు ద్వారా ప్రతి కుటుంబానికి సరిపడే తాగునీటిని అందించడం జరుగుతుందన్నారు. సర్పంచ్ వార్డు సభ్యులతో కలసి గ్రామాల్లోని అన్ని ప్రాంతాల్లో త్రాగునీటి కుళాయిలు, పరిశుభ్రమైన తాగునీటి వినియోగం గురించి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. అదేవిధంగా గ్రామాల్లోని అంగన్వాడీ, గ్రామ పంచాయితీ, ఆరోగ్య కేంద్రాలకు, పాఠశాలలకు త్రాగునీటి కుళాయిలను అందిస్తామన్నారు. వర్షపు నీటని వృదా కాకుండా భూగర్బజలాలు పెంపొందించే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ అధికారులు గుడివాడ మండలం శేరివేల్పూరు, సిద్ధాంతం గ్రామాలను హర్ ఘర్ జల్ నూరుశాతం ఇంటింటికి కుళాయి పొందిన గ్రామాలుగా ధ్రువీకరించారు. ఈ సందర్భంగా మురికినీటిని శుద్ధి చేయు ప్లాంట్ నిర్మాణం కొరకు మంజూరు అయిన స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తమ ఊరిని హర్ ఘర్ జల్ నూరు శాతం ఇంటింటికి కుళాయి పొందిన గ్రామాలుగా ప్రకటించడం పై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జలజీవన్ మిషన్ జిల్లా ప్రతినిధులు నేరిన్, రామకృష్ణ, నాగేశ్వరరావు, శేరివేల్పూరు గ్రామ సర్పంచ్ యం. ప్రభాకర్రావు, సిద్ధాంతం సర్పంచ్ యి.కృష్ణామూర్తి, ఎంపీటీసీ సభ్యురాలు సింగవరపు ఝాన్సీ రాణి, ఆర్ డబ్య్లూఎస్ ఏఈ అట్లూరి వెంకటేశ్వరరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి పి. పూర్ణచంద్రరావు, సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.