తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రణాళికా మరియు గణాంక శాఖ ముఖ్యమైన శాఖ అని, అందులో డేటా బేస్ పక్కాగా నిర్వహణ ఉండాలని, గౌ. ముఖ్యమంత్రి హామీలు, గడప గడపకు మన ప్రభుత్వం, ఎంపీ లాడ్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలు అమలు వంటి అంశాలపై జిల్లా ప్రణాళికా శాఖపై జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ సమీక్షించి దిశా నిర్దేశం చేశారు.
శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ప్రణాళికా మరియు గణాంక శాఖపై జిల్లా కలెక్టర్ సమీక్షించి మాట్లాడుతూ ఎంపీ ల్యాడ్స్ నిధులు వాటి కింద గుర్తించిన, మంజూరైన పనుల పురోగతిపై, అలాగే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు జిల్లాలో పర్యవేక్షించాల్సిన 54 ప్రాధాన్యత అంశాలపై దృష్టి పెట్టాలని నివేదికలు ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. జిల్లా సమీక్ష సమావేశాల నిర్వహణ, వాటి అంశాలు, గౌ.ముఖ్యమంత్రి గారి హామీల పై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రణాళికా మరియు గణాంక శాఖ అధికారి ప్రేమ్ చంద్ర వివరిస్తూ గణాంక శాఖ ద్వారా వర్షపాత వివరములు, పంటలసాగు విస్తీర్ణములు, వ్యవసాయ గణన గ్రామం యూనిట్ గా వరిపైరుపై పంటకోత ప్రయోగాలు మరియు ఇతర సాధారణ పంటల పంట కోత ప్రయోగాలు, పారిశ్రామిక ఉత్పత్తి పై సర్వేలు మరియు వివిధరకాల వినియోగ వస్తువుల ధరలు సేకరణ, మొదలగు నమూనా సర్వే లు చేపడతామని తెలిపారు. కుల గణన నిర్వహణ పై వివరిస్తూ జిల్లాలో ఇప్పటి వరకు 86 శాతము గృహాలు గణన పూర్తి అయినట్లు కలెక్టర్ కి వివరించారు.
ఈ సమావేశములో గణాంకాధికారి బాలాజిసింగ్, ఉప గణాంకాధికారులు రాజేంద్రప్రసాద్, విజయ, రాజరాజేశ్వరి, క్రిష్ణయ్య మరియు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.