– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం ఎంతో ఆదర్శనీయమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆ మహనీయుని వర్థంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద సోమవారం టంగుటూరి విగ్రహానికి పూలమాలలు వేసి సోమవారం ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అతి సామాన్య కుటుంబంలో జన్మించిన ప్రకాశం పంతులు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకున్నారని మల్లాది విష్ణు అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ పిలుపుతో తన న్యాయవాది వృత్తిని విడిచి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారన్నారు. వందేమాతరం, స్వదేశీ ఉద్యమ సమయాల్లో అనేక సభలకు అధ్యక్షత వహించారని తెలిపారు. దేశం కోసం న్యాయవాద వృత్తిని విడిచి, ఆర్జనను ప్రజలకు పంచిపెట్టిన ప్రకాశం స్ఫూర్తి ఈతరం యువతకు ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఆయన ప్రారంభించిన స్వరాజ్య పత్రిక స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఆంధ్ర ప్రజల అకుంటిత ధైర్యసాహసాలకు, అసమాన త్యాగనిరతికి టంగుటూరి మారుపేరుగా నిలిచారని.. తెల్లవాడి తూటాకు గుండెను చూపిన ధీశాలి అని కొనియాడారు. 1952లో భారీ వరదలు వచ్చిన సమయంలో పార్లమెంటులో పోరాడి ప్రభుత్వ నిధులతో కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణానికి పూనుకున్నారన్నారు. 1954 న సీఎం హోదాలో బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో.. బ్యారేజీకి ఆయన పేరు పెట్టారని తెలిపారు. ఆ మహనీయుని ఆదర్శాలే స్ఫూర్తిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఆయన బాటలోనే పయనిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రకాశం పంతులు ధైర్యాన్ని, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో 33వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరక్టర్లు చల్లా సుధాకర్, దోనేపూడి శ్రీనివాస్, నాయకులు దమ్మాలపాటి చంద్రశేఖర్, సౌమ్య బాబు, పరసా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.