-పునరుద్దరించిన సిఆర్ఎస్ సాఫ్ట్ వేర్పై డిఎంహెచ్వోలు కింది స్థాయి సిబ్బందికి శిక్షణ ఇప్పించాలి
-డిఎంహెచ్వోలకు ఒక రోజు రాష్ట్రస్థాయి శిక్షణా కార్యక్రమంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించి 2023 అక్టోబర్ 1 నుండి అమలులోకొచ్చిన సరికొత్త విధానంపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(Special chief secretary) ఎం.టి.కృష్ణబాబు అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖాధికారులు(DM&HOs)లకు సూచించారు. ప్రజలందరికీ దీని గురించి వివరంగా తెలియజేయాల్సి బాధ్యత మనపై ఉందన్నారు. పునరుద్ధరించిన సిఆర్ యస్ పోర్టల్ (Revamped CRS Software)పై అవగాహన కల్పించేందుకు విజయవాడలోని మురళీ ఫార్ట్యూన్ లో అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖాధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు, జనన మరణ రిజిస్ట్రార్ అధికారులకు సోమవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమంలో కృష్ణబాబు ప్రారంభోపన్యాసం చేశారు. గతంలో ఉన్న సిఆర్ ఎస్ పోర్టల్ లో అదనంగా పలు మార్పులు తీసుకొస్తూ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా తాజాగా పునరుద్దరించిందని, అందువల్ల దీనిపై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు. ఎవరైనా సరే వారి వారి ప్రాంతీయ భాషల్లో అన్ లైన్ లో రిపోర్టు చేసుకునే వెసులుబాటు, ఆన్లైన్ లోనే రుసుం చెల్లింపు, లేటుగా నమోదుకు సంబంధించి కల్పించే సౌకర్యాలు, ఇమెయిళ్లకు డిజిటల్ జనన మరణ ధృవీకరణ పత్రాన్ని పంపించే వెసులుబాటు, డూప్లికేట్ మరియు ఫేక్ సమాచార్ని చెక్ చేసుకోవడం, ఎస్ఎంఎస్, ఇమెయిళ్ల ద్వారా నోటిఫికేషన్లు పంపడం వంటి మార్పుల్ని పునరుద్దరించిన సిఆర్ ఎస్ పోర్టల్ ద్వారా తీసుకొచ్చారని కృష్ణబాబు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలోని విస్తృతమైన నెట్వర్క్ ద్వారా దీనిపై మరింతగా ప్రజలకు తెలియజెప్పాలన్నారు. 43 వేలకు పైగా ఆశా వర్కర్లు, 13 వేలకు పైగా ఎఎన్ఎంలు, 10032 మంది సిహెచ్వోలు ఇందులో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్తగా అమలులోకొచ్చిన జనన ధృవీకరణ పత్రం(Birth certificate) తప్పని సరి అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన గురుతరమైన బాధ్యత డిఎంహెచ్వోలపై ఉందన్నారు.
ప్రసవాల అనంతరం డిస్ఛార్జ్ అయ్యే సమయంలో జిజిహెచ్లు, సెకండరీ హెల్త్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు జనన ధృవీకరణ పత్రాల్ని జారీ చేయాలన్నారు. అలాగే సంబంధిత రిజిస్టర్ లో సంతకం చేయాలన్నారు. హెచ్ఎంఐస్ డేటాతో కూడా సరి చూసుకోవాలన్నారు. 2023లో జనన మరణాల నమోదు సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, 2023 అక్టోబర్ 1 నుండి అమలులోకొచ్చిందని కృష్ణబాబు ఈ సందర్భంగా తెలిపారు. సవరించిన చట్టంపై రాష్ట్ర స్థాయిలో జిల్లా కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో ఇటీవల వర్చువల్ కాన్ఫరెన్స్ ను నిర్వహించారన్నారు. దీనిపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేయాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉందన్నారు. సవరించిన జనన మరణ నమోదు చట్టం(Amended RBD act 2023) ప్రకారం పుట్టిన తేదీ, ప్రాంతం ధృవీకరణకు ఇకపై జనన పత్రం ఉపయోగపడుతుందన్నారు. విద్యా సంస్ధల్లో చేరేందుకు, డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు, ఓటర్ జాబితాను రూపొందించేందుకు, వివాహాల నమోదుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ నియామకాలకు, పాస్పోర్ట్, ఆధార్ కార్డు జారీ, కేంద్ర ప్రభుత్వం సూచించే మరేరకమైన ధృవీకరణ పత్రాలకైనా సరికొత్త జనన పత్రం ఉపయోగపడుతుందన్నారు. జనన మరణాల సమాచారాన్ని నిర్వహించాలని సవరించిన చట్టం సూచిస్తోందని, అందుకనుగుణంగా అన్ని ఆసుపత్రులూ మరణానికి గల కారణాన్ని(cause of death) నిర్దేశిత ఫార్మాట్లో తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ విషయంలో గ్రామ, వార్డుసచివాలయాల వ్యవస్థను మరింత పటిష్టపర్చాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఏవిధంగా అయితే డిజిటల్ సర్టిఫికేట్లను డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించామో అదే విధంగా జనన ధృవీకరణ పత్రాలు ఎక్కడైనా ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్ని ఈ వ్యవస్థకు అనుసంధానం చేయడం ద్వారా సేవల్ని మరింత విస్తృతం చేయవచ్చన్నారు. పునురుద్ధరించిన సిఆర్యస్ పోర్టల్ ఎంతో ఉపయుక్తంగా ఉందన్నారు. ఈ పోర్టల్ ద్వారా మరణాలకు గల కారణాల్ని ( cause of death ) నమోదు చేసే విషయంలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు తగు సూచనలివ్వాలన్నారు. రాష్ట్ర స్థాయిలో శిక్షణ తీసుకున్న అధికారులు క్షేత్ర స్థాయిలో అమలు చేసే క్రమంలో ఎదురైన అనుభవాల్ని తిరిగి తెలియజేస్తే భవిష్యత్తులో మరింత మెరుగైన విధానాన్ని రూపొందించేందుకు వీలు కలుగుతుందన్నారు.
క్లినికల్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ను పునరుద్ధరించనున్నాం….స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణబాబు
విజయవాడ,క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ వెబ్సైట్ను ఈ నెలాఖరులోగా పునరుద్దరించనున్నామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణబాబు అన్నారు. పునరుద్దరించిన సిఆర్ ఎస్ పోర్టల్ పై సోమవారం ఫార్ట్యూన్ మురళి లో నిర్వహించిన రాష్ట్రస్థాయి శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రులు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే పూర్తి సమాచారాన్ని పొందుపర్చగలిగేలా ఈ వెబ్సైట్ ను తీర్చిదిద్దుతామన్నారు. ఈ విషయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. ఎన్ని ఆసుప్రతులు, క్లినిక్ల రిజిస్ట్రేషన్ కు సంబంధించి సమగ్ర సమాచారాన్ని పొందుపరిస్తే విశ్లేషించేందుకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. నర్సింగ్ కాలేజీల విషయంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తామన్నారు. మరణాలను ప్రైవేట్ ఆసుపత్రులు ఏమేరకు నమోదు చేస్తున్నాయన్న విషయాన్ని పరిశీలించాలన్నారు. అలాగే ప్రభుత్వం నోటిఫై చేసిన వ్యాధుల్ని(Notifiable diseases) ప్రైవేట్ ఆసుపత్రులు ఏ మేరకు నమోదు చేస్తున్నాయన్న అంశాన్ని పర్యవేక్షించాలని డిఎంహెచ్వోలకు సూచించారు. ఇందుకు సంబంధించి ముందస్తు సమాచారం ఉంటే చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. 2025నాటికి టిబి రహిత దేశంగా తీర్చిదిద్దాలన్న విషయంలో మనం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. టిబి, సికెల్సెల్ అనీమియా వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. పునరుద్ధరించిన సిఆర్యస్ పోర్టల్ కు సంబంధించి శిక్షణలో నేర్చుకున్న అంశాల్ని పునరుశ్చరణ చేసుకోవాలన్నారు. సెన్సన్ ఆపరేషన్ ఎపి డైరెక్టర్ పి.బాలకిషన్ మాట్లాడుతూ గతంలో ఉన్న సిఆర్ యస్ పోర్టల్ లో తీసుకురావాల్సిన మార్పులపై వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు చేసిన సూచనలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయన్నారు. ఆయన సూచనల్ని పరిగణలోకి తీసుకుని పునరుద్దరించిన సిఆర్యస్ పోర్టల్లో పొందుపర్చామన్నారు. 25 రాష్ట్రాలు సిఆర్యస్ పోర్టల్ను వినియోగిస్తున్నాయని, మొబైల్ అలెర్్ట, రిజిస్ట్రేషన్ యూనిట్కు వెళ్లకుండానే పేరును చేర్చడం, పబ్లిక్ సెర్చ్ ఆప్షన్ , ప్రజలు ఎక్కడి నుండైనా ఆన్ లైన్లో నమోదు చేసుకోవడం వంటి సౌకర్యాన్ని కల్పించామన్నారు. మిగతా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా సిఆర్యస్ పోర్టల్ ను సమర్ధవంతంగా వినియోగిస్తోందనీ, వైద్య ఆరోగ్య శాఖ పూర్తి సహాయసహకారాన్ని అందిస్తోందని అన్నారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నిపుణుల బృందం పునరుద్ధరించిన సిఆర్యస్ పోర్టల్పై శిక్షణ ఇచ్చారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.