మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో స్ట్రాంగ్ రూములకు మూడంచెల పటిష్టమైన భద్రత కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల్లో త్రాగునీరు, విద్యుత్ సరఫరా పరిస్థితి, ఉపాధి హామీ, శాంతిభద్రతలు అంశాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ విసీ హాల్ నుండి సి ఎస్ వీసీలో పాల్గొన్నారు.
జిల్లాలో తాగునీటి, విద్యుత్ సరఫరా పరిస్థితి సిఎస్ కి కలెక్టర్ వివరించారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు స్థానిక కృష్ణా విశ్వవిద్యాలయం లో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలో స్ట్రాంగ్ రూములకు మూడంచెలతో పటిష్టమైన భద్రత కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో జూన్ రెండో వారంలో రైతులు తొలకరి పంటల సాగు ప్రారంభిస్తారని, గత అనుభవాల దృష్ట్యా తుఫాను పరిస్థితుల్లో ముంపును నివారించి రైతులకు పంట నష్టం జరగకుండా కాలువలు డ్రెయిన్ లలో తూడు తొలగించి కాలువలలో నీటి ప్రవాహం సజావుగా ఉండేందుకు ముంపు నివారణ చర్యలు చేపట్టవలసి ఉందని కలెక్టర్ సిఎస్ దృష్టికి తీసుకెళ్లారు.
వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్ డబ్ల్యు ఈఈ టి. శివప్రసాద్, డ్వామా పిడి జీవి సూర్యనారాయణ, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, వైయస్సార్ తాడిగడప మున్సిపల్ కమిషనర్లు బాపిరాజు, బాలసుబ్రమణ్యం, పి. వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.