-ఇసి అనుమతితో ఉపాధి హామీ పనులను పెద్దఎత్తున చేపట్టండి
-ఉపాధి హామీ పనుల్లో వాటర్ కన్జర్వేషన్ పనులకు అధిక ప్రాధాన్యతనివ్వాలి
-తాగునీరు,విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తితే తక్షణం పరిష్కరించండి
-సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఉపాధిహామీ,స్వచ్చ భారత మిషన్ అనుసంధానంతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పెద్దఎత్తున చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలక్టర్లను ఆదేశించారు.తాగునీరు,ఉపాధి హామీ పనులు,విద్యుత్ సరఫరా పరిస్థితులపై మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం పనుల నిర్వహణకు ప్రస్తుతం మంచి అనువైన సీజన్ కావున పెద్ద ఎత్తున ఉపాధి పనులు నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రాష్ట్రంలో లక్షకు పైగా వ్యక్తిగత మరుగు దొడ్లను మంజూరు చేశామని కావున ఉపాధి హామీ,స్వచ్చ భారత్ మిషన్ అనుసంధానంతో వాటికి సోక్ పిట్లను నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఉపాధిహామీ పనుల్లో వాటర్ కన్జర్వేషన్ పనులకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని ఆదేశించారు.తదుపరి తాగునీరు,విద్యుత్ సరఫరా పరిస్థితులపై సిఎస్ జవహర్ రెడ్డి కలక్టర్లతో సమీక్షించారు.
ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి సమస్య లేదని పూర్తి స్థాయిలో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు వివరించారు.ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఉపాధిహామీ పనులు,తాగునీటి సరఫరాపై ఆశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ 951 కోట్ల రూ.లతో ఉపాధిహామీ,స్వచ్ఛ భారత్ మిషన్ అనుసంధానం తో వ్యక్తిగత మరుగుదొడ్లకు సోక్ పిట్ల నిర్మాణానాన్ని పెద్దఎత్తున చేపట్టడం జరుగుతోందని తెలిపారు.రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా సమ్మర్ కార్యాచరణ ప్రణాళిక ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.తీవ్ర నీటిఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకులు ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నట్టు వివరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ కె.కన్నబాబు,ఆర్ డబ్ల్యుఎస్ ఇఎన్సి కృష్ణారెడ్డి,వర్చువల్ గా జిల్లా కలక్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.